సింగపూర్ తెలుగు సమాజం (STS) సింగపూర్లోని అవర్ టాంపనీస్ హబ్లో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించింది. సాధారణంగా నిర్వహించే సాంస్కృతిక, సామాజిక, భాషా సంబంధిత ఈవెంట్లతో పాటు వార్షిక ఈవెంట్లలో భాగంగా సమగ్రత & ఐక్యతను ప్రోత్సహించడానికి క్రీడలకు సంబంధించిన ఈవెంట్లను (బ్యాడ్మింటన్, బౌలింగ్ & క్రికెట్) కూడా ఎస్టీఎస్ నిర్వహిస్తుంది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్లపాటు విరామం తర్వాత, ఎస్టీఎస్ సభ్యుల కోసం జూలై 30 మరియు 31 తేదీలలో టాంపనీస్ హబ్లోని 8 కోర్టులలో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా స్థానిక తెలుగు క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 140 మంది పురుషులు, 60 మంది మహిళలు, 50 మంది చిన్నారులు ఉన్నారు. ఈ రెండు రోజుల టోర్నీలో వివిధ విభాగాల్లో 400+ మ్యాచ్లు నిర్వహించి విజేతలను ప్రకటించారు.
ఈ సంవత్సరం 50 మంది ఔత్స్యాహిక క్రీడాకారులకు ప్రముఖ శిక్షకులతో, బ్యాడ్మింటన్ శిక్షణా తరగతులు మరియు మెళుకువలు నేర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్టీఎస్ అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు మన శక్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని, వినోదానికి సాధనంగా నిలుస్తాయన్నారు. అలానే పోటీల్లో పాల్గొన్న తెలుగువారి క్రీడా నైపుణ్యాన్ని కూడా కొనియాడారు. పోటీల అనంతరం విజేతలకు స్పాన్సర్లతో బహుమతుల ప్రదానం చేశారు.
ఈ పోటీల్లో తెలుగు వారు ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొనడం పట్ల కార్యక్రమ నిర్వాహకులు మల్లికార్జున్ పాలెపు, శ్రీనివాస్ రెడ్డి పుల్లన్నగారి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన స్పాన్సర్లు, వాలంటీర్లు, కమిటీ సభ్యులు మరియు ప్రతి ఒక్కరికి ఎస్టీఎస్ కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.