సింగాపూర్ : కళ్లెదుటే కరోనాతో తన తండ్రి, ఇంకా ఎంతో మంది చనిపోవడంతో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్ ని కదిలించింది. కాలుష్యం మానవ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, ప్రజల్ని సులువుగా కరోనా, ఇతర అనారోగ్యాల బారిన పడేటట్లు చేస్తుందని తెలుసుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా,శారీరక దృఢత్వం కలిగి ఉండాలన్న ఆలోచనని కలిగించాలని- Solution to Polution (కాలుష్యానికి పరిష్కారం) అనే లక్ష్యంతో యాత్ర ప్రారంభించాడు.
దానికై కాలుష్యం కలిగించని,శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని అందించే సైక్లింగ్ చెయ్యాలని ధృడ సంకల్పతో అడుగులు వేసాడు రంజిత్. 2021 ఏప్రిల్ 5న మొదలైన రంజిత్ ఆన్ వీల్స్ సైక్లింగ్ భారతదేశం దాటి ఇప్పుడు ఆసియా ఖండంలోని వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా దేశాలను చుట్టి ఆగస్టు 29, 2023 న సింగపూర్ చేరుకున్నాడు. మంచి సంకల్పంతో రంజిత్ చేస్తున్న ఈ యాత్రకి సింగపూర్ తెలుగు సమాజం ఆతిథ్యం ఇచ్చింది. రంజిత్ చేస్తున్న కృషిని కమిటీ అభినందించింది.
ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ..ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటని, దీనివల్ల మానవాళి రోగనిరోధక సన్నగిల్లితుందని, మనమంతా కనీసం వారంలో ఒక్కరోజైనా సైక్లింగ్ చెయ్యాలని, దీనివల్ల పర్యావరణం మెరుగుపడటంతో పాటు మనమంతా శారీరకంగా దృఢంగా ఉంటామని తెలిపారు.
తరవాత కమిటీ సభ్యులు రంజిత్ ను సత్కరించారు.