హైదరాబాద్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. సందర్శన యాత్రలో భాగంగా సుమారు 200 మంది భక్తులు పాల్గొని.. 11 దేవాలయాలను సందర్శించారు. ఈ శివరాత్రి సందర్భంగా సింగపూర్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
కార్యక్రమానికి సమన్వయకర్తలుగా ప్రవీణ్ మామిడాల, ముద్దం విజ్జేందర్, కిషన్ రావు, పందిరి విశ్వ ప్రసాద్, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్, ప్రాంతీయ కార్యదర్శులు నడికట్ల భాస్కర్, బొందుగుల రాము వ్యవహరించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళిక తో సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీకి భక్తులందరూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు సొసైటీ అధ్యక్షుడు గడప రమేశ్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.