హైదరాబాద్ : విభజన హామీలను అమలు చేసిన తర్వాతనే మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని ఎస్ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం డిమాండ్ చేశారు. రైతులపై నల్ల చట్టాలను తీసుకవచ్చి, కార్మిక వ్యతిరేక విధానాలతో ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగుతూ, ప్రభుత్వరంగ సంస్థలను ఇష్టానుసారంగా అమ్ముతూ పోతున్న మోదీ ఏడాదిన్నర క్రితం ఎరువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారాన్ని ఇప్పుడు జాతికి అంకితమివ్వడమేంటని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా తెలంగాణలోని ఒక్క పథకానికి ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వని ప్రధాని తెలంగాణ ప్రజా ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని హెచ్చరించారు. తెలంగాణపై, ముఖ్యమంత్రి కేసీఆర్పైన కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుతో బీజేపీ బంగాళఖాతంలో కొట్టుకు పోవడం ఖాయమన్నారు.