Sankranti Celebrations | సింగపూర్లో నివసిస్తున్న తెలుగు వారు సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (SUTD)లో శనివారం ఘనంగా సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. భవిష్యత్ తరాలకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, పండుగల ప్రాశస్త్యం తెలియజేయడానికే ఈ సంబురాలు జరుపుకున్నట్లు కాకతీయ సాంస్కృతిక పరివారం తెలిపింది. శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పిల్లలు, పెద్దలు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నాలుగు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ విశిష్టత, దాని సంప్రదాయాలను పరివారం అధ్యక్షులు రాంబాబు పాతూరి వెల్లడించారు. 550 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తమ సంస్థ స్థాపించిన మూడేండ్లయిందని రాంబాబు పాతూరి చెప్పారు. కొవిడ్-19 తర్వాత ఇంత మంది తెలుగువారితో తమ సంస్థ జరుపుకుంటున్న రెండో అతిపెద్ద పండుగ అని తెలిపారు. ఇంత చక్కగా సంక్రాంతి సంబురాలు జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో చాలా మంది తెలుగువారు సన్నిహితులు అయ్యారన్నారు. విభిన్నమైన ఆటపాటలతో ఒకరితో మరొకరి పరిచయాలు పెరిగాయని అన్నారు. ఈ సంబురాలకు హాజరైన వారు సన్నిహితమయ్యేలా చక్కగా కార్యక్రమం రూపొందించారని పలువురు ప్రశంసించారు.