లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల నియమితులయ్యారు. ఈ మేరకు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగి నియమితులైన రత్నాకర్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటివరకు రత్నాకర్ వివిధ ప్రవాస సంఘాల్లో పనిచేశారని వెల్లడించారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమాలతోపాటు స్థానికంగా, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. టాక్ అధ్యక్షుడిగా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ, ప్రవాసులకు అండగా నిలవాలని, సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆశించారు. సంస్థ ఆవిర్భావం నుంచి ప్రత్యేక సలహాదారులుగా ఉంటూ సలహాలు సూచనలు అందించిన నందిని సిధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.