నార్వే: నవరస నట సార్వభౌమ, నటరత్న ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని నార్వే (Norway) దేశానికి చెందిన ‘వీధి అరుగు సాహితీ సంస్థ’ ఆంధ్వర్యంలో 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాలు ఘనంగా సత్కరించనున్నాయి. ‘శక పురుషుని శత వసంతాలు’ పేరుతో ఈ నెల 27న ఇంటర్నెట్లో ఇంటర్నేషనల్ ఆన్లైన్ మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ ఏడాది మే 28 నాటికి ఎన్టీఆర్ జన్మించి శత వసంతాలు పూర్తి కానున్నాయని, ఈ నేపథ్యంలో ఆ మహనీయుడిని ప్రత్యేకమైన రీతిలో గుర్తుచేసుకునేందుకు మే 27న అంతర్జాలంలో అంతర్జాతీయ ఆన్లైన్ మీట్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్టీఆర్ అభిమానులతోపాటు అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.