హైదరాబాద్ : ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన ఊరు ‘మన ఊరు మన బడి’ విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది.
గ్రామాల్లో మన ఊరు మన బడి, పట్టణాల్లో మన బస్తీ – మన బడితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై ఎన్నారైలకు విధి విధానాలను వివరించి వారిని ఇందులో భాగస్వాములను చేయడానికి ఫిబ్రవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై సంఘాలతో జూమ్ ఆన్లైన్ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొననున్నట్టు ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.
మన ఊరు – మన బడి అనేది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఇంత పెద్ద ఫ్లాగ్ షిప్ కార్యక్రం ద్వారా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ విద్య, ఆధునికీకరించిన టాయిలెట్లు, వంద శాతం విద్యుదీకరణ, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఫర్నిచర్, కొత్త తరగతి గదులు, సురక్షితమైన తాగునీటి సరఫరా, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు, మెరుగైన వంటశాలలు, డైనింగ్ హాళ్లతో సహా 12 రకాల అభివృద్ధి పనులు చేపడతారు.
రూ.10 లక్షలు దానం చేసిన దాతలకు వారు సూచించిన వారి పేరును పాఠశాలకు పెడుతారని మహేష్ తెలిపారు. ఎన్నారైలందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మహేష్ బిగాల పిలుపునిచ్చారు.