సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ఒక ప్రవాసీ మహిళకు అదృష్టం కలిసొచ్చింది. ఆమె కొనుగోలు చేసిన లాటరీ నెంబరుకు ‘బిగ్ టికెట్ అబుధాబి వీక్లీ డ్రా’ తగిలింది. దీంతో ఆమె ఏకంగా రూ.44.75 కోట్లు గెలుచుకుంది. కేరళకు చెందిన లీనా జలాల్ అనే యువతి.. అబుధాబికి వలస వెళ్లింది. అక్కడ ఒక కంపెనీలో మానవవనరుల విభాగంలో పనిచేస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె ఒక లాటరీ నెంబరు.. ‘టెర్రిఫిక్ 22 మిలియన్ సిరీస్ 236’లో గెలిచింది. ఫిబ్రవరి 3వ తేదీన ఈ లాటరీ డ్రా తీశారు. తను లాటరీ గెలవడం గురించి మాట్లాడిన లీనా.. ఈ డబ్బును మరో పదిమందితో పంచుకుంటానని, ఛారిటీలకు కూడా కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తానని చెప్పింది. లీనాతోపాటు మరో ప్రవాస భారతీయుడికి కూడా లాటరీ తగిలింది.
అతను కూడా కేరళవాసే కావడం గమనార్హం. సురైఫ్ సురు అనే వ్యక్తి 10 లక్షల దీనార్లు గెలుచుకున్నాడు. ఈ ప్రైజ్ మనీని మరో 29 మందితో పంచుకుంటున్నట్లు సురు తెలిపాడు. అలాగే పేదవాళ్లయిన తన స్నేహితులు కొందరికి ఆర్థిక సాయం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ‘‘కొంత డబ్బును పేరెంట్స్కు ఇస్తాను. మిగతా డబ్బును నా భార్యాపిల్లల భవిష్యత్తు కోసం దాచాలని అనుకుంటున్నా’’ అని సురు వెల్లడించాడు.