మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని సీఎం కేసీఆర్ అన్నారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో సీఎం చర్చించారు.
ఆగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజా రక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష చేపట్టిన కేసీఆర్.. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఇండ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన సీఎం తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి. నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 32 గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. గడిచిన 24 గంటల్లో చార్మినార్లో అత్యధికంగా 26.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి జులై 22 వరకు హైదరాబాద్లో 73 శాతం అధికంగా వర్షపాతం కురిసింది.
గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో వాన దంచికొట్టింది. ఆ జిల్లాలోని నర్సాపూర్లో అత్యధికంగా 245 మి.మీ. వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా 44.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 115.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 204 మి.మీ. వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పర్యటించారు. వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశవ్యాప్తంగా తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తెలంగాణతో పాటు దక్షిణ చత్తీస్ఘడ్, విదర్భ ప్రాంతాల్లో ఇవాళ, రేపు జోరుగా వానలు కురవనున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇవాళ, రేపు.. ఆ తర్వాత 25, 26 తేదీల్లోనూ అత్యధిక స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో 26వ తేదీ తర్వాత విస్తారంగా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే దాశరథి స్ఫూర్తితో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి చేసుకున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో గురువారం దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు.
పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ అంశంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని ఇవాళ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. లాయర్ ఎంఎల్ శర్మ ఆ పిల్ వేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు సీబీఐని ఆ పిల్లో పార్టీలుగా చేర్చారు. పెగాసస్ సాఫ్ట్వేర్తో భారతీయ పౌరులపై రాజకీయ ప్రయోజనాల కోసం నిఘా పెట్టినట్లు ఆ పిల్లో ఆరోపించారు. సుప్రీం వేసిన సిట్ ఆధ్వర్యంలో దీనిపై దర్యాప్తు జరగాలని పిల్లో కోరారు.
దేశంలో థర్డ్ వేవ్ విజృంభించనుందన్న వార్తలు గుప్పుమంటున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా స్తబ్దుగా ఉన్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి విమర్శించారు. తాను త్వరలోనే ఢిల్లీకి వెళ్తున్నానని, ఓ రెండు మూడు రోజులపాటు తన పర్యటన కొనసాగనుందని ఆమె తెలిపారు.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఐటీ యాక్ట్లోని సెక్షన్ 67ఏ మోపడం సరైంది కాదని ఆయన తరఫు న్యాయవాది అబద్ పోండా కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ చట్టం ప్రకారం నిజమైన శృంగార సంభోగమే పోర్న్ అని, మిగితా అంతా బూతు కాంటెంట్గా పరిగణిస్తారని లాయర్ తెలిపారు. పోర్న్ రాకెట్ నడుపుతున్నట్లు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాను ఇటీవల ముంబై క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.