హైదరాబాద్: కెనడాలోని కాల్గరీలో ఉన్న శ్రీ అనఘా దత్త సొసైటీలో గణపతి నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువందనం, చతుర్వేద పారాయణం, వినాయక పూజలు సాంప్రదాయ బద్ధంగా జరిగాయి.
కాల్గరీ డౌన్టౌన్ వీధిలో నిర్వహించిన గణనాథుడిని ఊరేగింపు అందరిని ఆకట్టుకున్నది. ఇందులో కాల్గరీ, ఎడ్మాంటన్, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా మేళ తాళాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, భగవన్నామ స్మరణలతో మారుమ్రోగింది. ఈ ఉత్సవానికి హాజరైన కెనడా పార్లమెంట్ సభ్యుడు జస్రాజ్ హల్లాన్.. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.
శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ ఆలయంలో షిరిడీ సాయిబాబా, అనంత పద్మనాభస్వామి, అనఘా దేవి, శివుడు, హనుమంతుడు, గణేశుడు, కార్తికేయ దేవతలు కొలువుదీరారు. ఆలయ నిర్వాహకులు లలిత, శైలేష్ భాగవతుల, ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్ శర్మ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతవడానికి సహకరించిన ఎంపీ జస్రాజ్ హలాన్, వాలంటీర్లకు శైలేష్ భాగవతుల కృతజ్ఞతలు తెలిపారు.