NRI news : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామికమని బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా విభాగం నాయకుడు నాగరాజు గుర్రాల తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులను శాసనసభకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవద్దని రాష్ట్ర డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి చెంపపెట్టులాంటిదని అన్నారు.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన హక్కని, పోలీసు బలంతో ప్రతిపక్ష గొంతును అణచివేయాలని ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలను వెంటనే నిలిపివేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా శాసనసభకు హాజరై ప్రజల సమస్యలను ప్రస్తావించే వాతావరణాన్ని కల్పించాలని నాగరాజు గుర్రాల డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ చేపట్టే పోరాటాలకు దక్షిణాఫ్రికాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు.