ఉద్యోగాల కోసం పొట్ట చేతపట్టు కొని విదేశాలకు వెళ్లిన ఆ భారతీయులకు తీవ్రమైన నిరాశే మిగిలింది. నెలల తరబడి జీతాలు అందక, చేతిలో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులూ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఆ దేశంలో తిరుగుబాటు చెలరేగింది. బెదిరిపోయిన ఆ కంపెనీ యజమాని దేశం విడిచి పారపోయాడు.
దీంతో ఎటూపోలేక, ఏం చేయలేని అయోమయ స్థితిలో పడిపోయారా భారతీయులు. ఇప్పుడు తమకు సాయం చేసి, స్వదేశానికి తీసుకువెళ్లాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదంతా సూడాన్లో జరిగింది. ఇక్కడ ఒక కంపెనీలో పనిచేసేందుకు వెళ్లిన 62 మంది భారతీయులు ఇప్పుడు దిక్కులేని స్థితిలో ఉన్నారు.
తమ పాస్పోర్టులను కంపెనీ తీసేసుకుందని, తిరుగుబాటు సమయంలో యజమాని దేశం నుంచి పారిపోయాడని వాళ్లు వాపోయారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా జీవనం సాగించాల్సి వస్తోందని తమ కష్టాలు చెప్పుకున్నారు. తమకు ఎలాగైనా సాయం చేసి, స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. ఈ విషయం తెలిసిన భారత ఎంబసీ అధికారులు.. సూడాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.