హైదరాబాద్ : ఎంత ఖర్చయినా భరించి.. ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన తెలంగాణ విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించడంపై టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. యుద్ధం వల్ల రాష్ట్రానికి చెందిన 740 మంది మెడిసిన్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని.. ఇలాంటి ఆపత్కాలంలో విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడం గొప్పవిషయమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఉక్రెయిన్ విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పడం గొప్ప విషయమన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్నారైల తరఫున సీఎం కేసీఆర్కు మహేశ్ బిగాల ధన్యవాదాలు తెలిపారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ విద్యనభ్యసిస్తూ అర్ధంతరంగా చదువులు మానేసి స్వదేశానికి వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన 740 మంది విద్యార్థులకు ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మెడిసిన్ విద్యార్థులంతా విద్యా సంవత్సరంతో పాటు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.