హైదరాబాద్ : దేశంలో ప్రశ్నించే గొంతులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అణిచివేస్తున్నారు. బీజేపీ ఒంటెత్తు పోకడలను నిలువరించాలంటే సీఎం కేసీఆర్ లాంటి దార్శనికుడు జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.
వర్తమాన భారత రాజకీయ పరిస్థితుల పై ప్రవాస భారతీయులతో మహేష్ బిగాల స్విట్జర్లాండ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతిపక్షాలు పూర్తి గా విఫలమైన ఈ సమయంలో రాజకీయ శూన్యత ఉందని, దానిని పూరించ గల సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ పార్టీ నియంతృత్వ పోకడలను అవలంబిస్తుందని మండిపడ్డారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ లాంటి నేత రావడం దేశాభివృద్ధికి ఎంతో మంచిదన్నారు.
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ముగిసి పోయిన అధ్యాయమని పేర్కొన్నారు. నేడు నియంతృత్వ కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలను ప్రశ్నించే సరైన గొంతుక కొరవడింది. కేసీఆర్ లాంటి బహుముఖ ప్రజ్ఞశాలి జాతీయ రాజకీయాల్లోకి రావడం అత్యవసరమన్నారు.
సమావేశానికి హాజరైన సభ్యులందరూ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, తమ అసమాన పరిపాలనా దక్షతతో తెలంగాణలో సాధించిన విజయాలు, తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశమంతటికి అందించాలని వారు ఆకాంక్షించారు.
సమావేశంలో స్విస్ తెలుగు ఎన్నారై ఫోరం అధ్యక్షురాలు పద్మజా రెడ్డి, టీఆర్ఎస్ స్విస్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ గందె, హెచ్ ఎస్ ఎస్ స్విస్ ముఖ్యుడు పవన్ దుద్దిళ్ల, తెలంగాణ జాగృతి స్విస్ శాఖ అద్యక్షుడు కిషోర్ తాటికొండ, స్విస్ తెలుగు సంఘం సభ్యులు అనిల్ జాల, అల్లు కృష్ణా డ్డి తదితరులు పాల్గొన్నారు.