హైదరాబాద్ : శ్రీ అనఘా దత్త సొసైటీ వారి ఆధ్వర్యంలో కెనడా కాల్గరీ సాయి బాబా మందిరం లో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి. భగవన్నామ స్మరణ కీర్తనలతో ధూప, దీప నైవేద్యాలతో వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వెయ్యికి పైగా దీపాలు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలతో ప్రారంభమై భగవన్నామస్మరణలు, పూజలు, హారతులతో దైవ ప్రాంగణం దీపాల అలంకారాలతో కనులవిందు చేసింది. మధ్యాన్నహారతి, రుద్ర హోమం, కార్తీక పూర్ణిమ సత్యనారాయణ వ్రతం చేశారు.
ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్ శర్మ విశేషానుభవంతో దేవ, దేవి అలంకారాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాజకుమార్ శర్మ కార్తీక దీప విశేషాన్ని భక్తులకు వివరించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు పూజలో పాల్గొన్నారు. మందిరంలో శివ, పార్వతి, సాయిబాబా మూర్తులకు అభిషేకం జరిగింది. నాలుగు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారు.
ఆలయ నిర్వాహుకులు లలిత, శైలేష్, వలంటీర్లతో ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్దగా నిర్విఘ్నంగా నెరవేర్చారు. ఆలయ నిర్వహణ తోట్పాటుకు ఎంతో మంది విరాళాలు సమర్పించారు.ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ.. ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన హైందవ సాంప్రదాయ పటుత్వాన్ని నెలకొల్పాలన్నారు.
హిందూ రక్షణలో భాగం కావాలని కోరారు. శ్రీ అనఘా దత్త సొసైటీ అఫ్ కాల్గరీ ఒక హిందూ రక్షణ సమితి. హైందవ సాంస్కృతిక సంగీతం, భరత నాట్యం, క్లాసికల్ ఆర్ట్స్ మరిన్ని శాఖల పరిరక్షణకి ఆయువు పట్టుగా నిలిచిందని కొనియాడారు.