NRI News | భారత సంతతి అమెరికన్ అనిల్ బోయినపల్లికి 2024 స్టేట్ స్మాల్ బిజినెస్ పర్సన్ అవార్డు లభించింది. వర్జీనియాలో స్కై సొల్యూసన్స్ కో-ఫౌండర్, సీఈఓగా అనిల్ బోయినపల్లి వ్యవహరిస్తున్నారు. అనిల్ బోయినపల్లితోపాటు రాష్ట్రాల వారీగా అమెరికా ఆర్థికాభివ్రుద్ధికి దోహదం చేసిన యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్బీఏ) ఈ అవార్డులు ప్రకటించింది. వర్జీనియాలోని హెర్న్డాన్ కేంద్రంగా స్కై సొల్యూషన్స్ సంస్థను 2008లో అనిల్ బోయినపల్లి స్థాపించారు. వ్యాపార లావాదేవీల్లో సంక్లిష్టతలను సరళతరం చేస్తూ కస్టమర్లకు టెక్నాలజీ సొల్యూషన్స్ అందించడమే ఈ కంపెనీ లక్ష్యం.
‘దక్షిణ భారత దేశంలోని మారుమూల గ్రామంలో మొదలైన ప్రయాణంలో లభించిన ఈ అవార్డు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అమెరికాలో లభిస్తున్న అవకాశాలకు ఇది నిదర్శనం’ అని అనిల్ బోయినపల్లి తన లింక్డ్ ఇన్ ఖాతాలో రాసుకున్నారు. ఇంతకుముందు అనిల్ బోయినపల్లి సీఎన్ఎస్ఐలో సొల్యూషన్స్ ఆర్కిటెక్గా పని చేశారు. న్యూ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్, సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్లో అన్ని కోణాల విభాగంలో ఆయన ఆర్కిటెక్ గా వ్యవహరించారు. తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.
వాషింగ్టన్లోని వాల్డార్ఫ్ ఆస్టోరియా హోటల్లో వచ్చే నెల 28-29 తేదీల్లో ఎన్ఎస్బీడబ్ల్యూ అవార్డు ప్రదానం జరుగుతుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి స్మాల్ బిజినెస్ పర్సన్ అవార్డులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్యాబినెట్లో ఎస్బీఏ అడ్మినిస్ట్రేటర్ ఇసాబెల్ కాసిల్లాస్ గుజ్మన్ విజేతలకు అవార్డులను ప్రదానం చేస్తారు. ఏప్రిల్ 30- మే మూడో తేదీ మధ్య వివిధ నగరాల్లో చిన్న వ్యాపారాలకు గుర్తింపుగా రోడ్ షో కూడా నిర్వహిస్తారు.