స్టూడెంట్ వీసాపై తొమ్మిదేళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లిన హైదరాబాదీ వంశీ రెడ్డి చింతా రెడ్డి.. ఇటీవల కన్నుమూశారు. ఆష్బర్టన్లో డైరీ ఫామ్ మేనేజర్గా పనిచేసిన వంశీ న్యూజిలాండ్లోనే మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చి, వారి కుటుంబ సభ్యులకు అప్పగిచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు కృషి చేస్తున్నారు. తన వద్దకు వచ్చిన వంశీ కుటుంబ సభ్యుల అవసరం తెలుసుకున్న ఎమ్మెల్సీ తాతా మధు.. టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాలను సంప్రదించారు.
దీంతో కదిలిన ఎన్నారై టీఆర్ఎస్ వర్గాలు న్యూజిల్యాండ్ నుంచి వంశీ రెడ్డి పార్థివ దేహాన్ని తరలించే ఏర్పాట్లు చేసేందుకు కాన్సులెట్ అధికారులతో మాట్లాడారు. వారికి న్యూజిల్యాండ్ తెలుగు అసోసియేషన్ (NZTA), తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ (TANZ) మరియు మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ (MATA) ప్రతినిధుల నుంచి సహకారం లభించింది.
మహేష్ బిగాల మాట్లాడుతూ.. న్యూజిలాండ్ లో టీఆర్ఎస్ ఎన్నారై ఎన్జీ అధ్యక్షుడు జగన్ వోదనల, తెలంగాణ సీనియర్ నాయకుడు కళ్యాణ్ రావు కాసుగంటి కావాల్సిన ఏర్పాట్లను చూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఎన్నారై ఇంచార్జి చిట్టిబాబుతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసినట్టు మహేష్ తెలిపారు. అలాగే న్యూజిలాండ్లో సహాయ సహకారాలు అందిస్తున్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు.