హైదరాబాద్: సింగపూర్లో గురు కళాంజలి కార్యక్రమం ఆధ్యంతం అద్వితీయంగా సాగింది. ‘స్వర లయ ఆర్ట్స్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా నిర్వహించారు. స్వర లయ ఆర్ట్స్ విద్యార్థులైన బొమ్మకంటి అనన్య, షణ్మిత తంగప్పన్ ప్రార్ధనాగీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలిండియా రేడియో ఆర్టిస్ట్ పప్పు పద్మా రవిశంకర్ వీణావాదనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేయగా, ఆమె తనయులు జ్ఞానదేవ్, జయదేవ్లు వయోలిన్, మృదంగ సహకారంతో సాగిన ఈ సంగీతఝరి మరింత రక్తి కట్టింది.
అనంతరం స్వర లయ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషు కుమారి కళాకారులతో వారి గురు పరంపర, వారి గురువుల విద్యాబోధనా విధానాల గురించి ఇంటర్వ్యూ రూపంలో చర్చించారు. కళాకారుల ప్రదర్శనలతోపాటు, వారి గురువుల కళావిశిష్టత, వైవిధ్యం మొదలైన అంశాలపై చర్చలతో విజ్ఞానవంతముగా ముందుతరాలకు ఉపయుక్తంగా రూపొందించబడిందని శేషు కుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత సుధానిది గుమ్ములూరి శారద సుబ్రహ్మణ్యం, బొమ్మకంటి సౌజన్య, కవుటూరు లలితా రత్నకుమార్, సౌభాగ్యలక్ష్మి రాజశేఖర్, విద్యాధరి, రాధిక నడదూరు తదితరులు పాల్గొన్నారు.