Bonalu @ USA | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : మన బోనాల జాతర సంబురాలు ఖండాంతరాలు దాటాయి. తెలంగాణ సంసృతి, ఆచార సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బోనాల జాతరను అగ్రరాజ్యం అమెరికాలోనూ ప్రవాసీయులు తొలిసారి ఘనంగా నిర్వహించుకున్నారు.

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఎంఏటీఏ), సాయి దత్త పీఠం, శ్రీ శివ విష్ణు దేవాలయం సంయుక్త ఆధ్వర్యంలో న్యూజెర్సీలో సోమవారం బోనాల జాతరను నిర్వహించారు.

హైదరాబాద్ లాల్దర్వాజ లష్కర్ బోనాలను మరిపించేలా, న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్లో పోతురాజు నృత్యాలతో అట్టహాసంగా వేడుక జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసులు భారీ సంఖ్య లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎడిసన్ ప్రాంతంలోని తెలుగు ఆడపడుచులు బోనమెత్తారు.

అమ్మ వారిని మేళతాళలతో ఘనంగా స్వాగతించి, పూజలు సమర్పించి, తెలంగాణ -అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. సాయిదత్తపీఠం చైర్మన్ రఘుశర్మ, శంకరమంచి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంఏటీఏ అధ్యక్షుడు శ్రీనివాస గనగోని అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో తొలిసారిగా బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతృప్తిని కలిగించిందన్నారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిరణ్ దుద్దగి, విజయ్ భాసర్ కలాల్, శ్రీధర్ గుడాల, దాము గేదెల, జైదీప్ రెడ్డి, కృష్ణశ్రీ గంధం, మహేందర్ నరలా, వెంకీ మస్తీ, కృష్ణ సిద్ధదా, రంగారావు మాడిశెట్టి, గిరిజా మాదాసి, మహిపాల్ రెడ్డి, రాకేష్ కస్తూరి, ప్రభాకర్, పూర్ణ, శేష గిరిరావు, శిరీష గుండపనేని, రఘు మడుపోజు, దీపక్ కట్టా, సురేష్ ఖజానా , అశోక్ చింతకుంట, మాధవి సోలేటి తదితరులు పాల్గొన్నారు.
