Ghantasala | అమరగాయకుడు ఘంటశాల శతజయంతి వేడుకలను నిర్వహించనున్నారు. సాంస్కృతిక కళాసారథి -సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఘంటశాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు డిసెంబర్ 4న జరుగనున్నాయి.
గతేడాది డిసెంబర్ 4న ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహిస్తూ వస్తున్న ‘ఘంటసాల స్వరరాగ మహాయాగం’ కార్యక్రమం సమాపణోత్సవం సింగపూర్లో ఘంటసాల శతజయంతి రోజున నిర్వహించనున్నట్లు సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు తెలిపారు. భారత్ నుంచి వంశీ అధ్యక్షుడు వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్, చంద్రతేజ, సురేఖ మూర్తి తదితర ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు, హాంకాంగ్ నుంచి జయ పీసపాటి హాజరుకానుండగా.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభినందనలు తెలిపారని చెప్పారు.
భారతదేశం నుంచి వస్తున్న ప్రముఖ గాయనీ గాయకులతో ప్రత్యేక సంగీత విభావరితో పాటు
శుభోదయం ఆధ్వర్యంలో నిర్మించబడిన ‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ ట్రైలర్ ఆవిష్కరణ, వంగూరి ఫౌండేషన్ ‘మన ఘంటసాల’ పుస్తకావిష్కరణ ఉంటుందని తెలిపారు. రాధిక మంగిపూడి కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా, పలువురు గాయనీ గాయకులు అమర గాయకుడు స్వర నీరాజనం అర్పించనున్నారు.