హైదరాబాద్: ఉన్నత విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవనశైలి మరెన్నో ఇతరత్రా కారణాలతో ప్రతి ఏడాది వందలాది మంది భారతీయులు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ ప్రక్రియలో తల్లితండ్రులని వదిలి దూరంగా ఉండటం, పిల్లల పెంపకంలో బాధ్యతలు, సామాజిక ఒంటరితనం, పనిఒత్తిడి వల్ల మనలో తెలియని నిరాశ నిస్పృహలు, మానసిక ఆరోగ్య సమస్యలు రావడం సహజం. వీటిగురించి కూలంకుషంగా చర్చిస్తూ ‘వీధి అరుగు’ వేదిక ఆధ్వర్యంలో ‘ఆనందమయమైన జీవితం-మానవసంబంధాలు’ అనే కార్యక్రమాన్ని ఇంటర్నెట్ వేదికగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కవి, రచయిత నండూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి సమర్థత, ఆనందం, సంతృప్తిలో మానవ సంబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. మానవ సంబంధాలను మెరుగుపరచడానికి 5 పొరలలుగా అధ్యయనం చేయాలన్నారు. అవి స్వీయ సంబంధం, కుటుంబంతో సంబంధం, స్నేహితులతో సంబంధం, పని ప్రదేశంలో సంబంధాలు, సమాజంతో సంబంధాలని వెల్లడించారు. వీటిని అధ్యయనం చేయడం ద్వారా విభేదాలకు కారణాలను, వాటిని సామరస్యంగా పరిష్కరించే మార్గాలను కనుక్కోవచ్చన్నారు. ఒక బంధం వల్ల ఇతరులపై మీకు ఎలాంటి హక్కులు లభించవని, సంబంధాలు బాధ్యతలను మాత్రమే తెస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి డెన్మార్క్ నుంచి రాజ్ కుమార్ కలువల అనుసంధానకర్తగా వ్యవహరించగా, సుబ్బారావు బోజెడ్ల, డాక్టర్ వీరంరాజు, డాక్టర్ లహరి సూరపనేని, రవిచంద్ర నాగభైరవ, సత్యనారాయణ కొక్కుల, రామకృష్ణ ఉయ్యురు, లక్ష్మణ్, డాక్టర్ విజయలక్ష్మి, వెంకట్, జగదీశ్, కే. నరసింహులు, బాలాజీ యాదవ్, రవితేజ గుబ్బ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని https://www.youtube.com/watch?v=1wgoyPF5eW0 అనే లింక్ ద్వారా పూర్తిగా వీక్షించవచ్చు.