లండన్ : సీఎ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో రాహుల్ గాంధీకిఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు గుర్తు రాలేదు? నేడు ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖం పెట్టుకొని వస్తాడని సూటిగా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఒక మెగా నోటిఫికేషన్ ఇచ్చి వారి కోసం రాష్ట్రమంతటా ఎన్నో స్టడీ సెంటర్లని ఏర్పాటు చేసిందన్నారు. నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగు నింపాలని సీఎం కేసీఆర్ ప్రత్నిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణాన్ని ఒక రణరంగంగా మార్చి, విద్యార్థుల్లో ఆందోళనను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
నాడు మలి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరు, అన్ని సంఘాలు వారి స్థాయిలో పోరాటాలు చేశాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి ఒక్కరు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గర్వపడుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉస్మానియా యూనివర్సిటీ ని ఎంచుకొని రాహుల్ గాంధీని తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు.
దేశంలోని ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బడిపడుతుంటే ఒక జాతీయ ప్రతిపక్ష పార్టీగా వాటి మీద పోరాటం చెయ్యకుండా ఇక్కడ ఒక యూనివర్సిటీలో రాద్దాతం చేస్తున్నారంటే, వీళ్ల పార్టీకి ప్రజల శ్రేయస్సు కంటే విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ముమ్మాటికీ రాహుల్ గాంధీ ఉస్మానియా విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి వారితో చర్చకు వెళ్లాలని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.