హైదరాబాద్ : గానకోకిల, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పి.సుశీల జన్మదినోత్సవం సందర్భంగా 13 దేశాల నుంచి 50 మంది గాయనీమణులు 100 పాటలు గానం చేశారు. భారతదేశం, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఓమాన్, ఖతార్, బహరేయిన్, మలేషియా మరియు స్వీడన్ దేశాల నుంచి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని గాయనీమణులు తమ మధురగానాలను వినిపించారు.
5 ఖండాలలోని తెలుగువారు వీక్షించిన ఈ అపూర్వ కార్యక్రమం వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శుభోదయం గ్రూప్ ఇండియా, శ్రీ సాంస్కృతిక కళా సారథి, సింగపూర్, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ప్రారంభోపన్యాసం చేస్తూ సుశీలకి ‘భారతరత్న’ ఇవ్వాలని అభిలషించారు.
కార్యక్రమ నిర్వాహకులుగా 12 గంటల పాటు ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ రచయిత్రి, గాయని, రాధిక నోరి వ్యాఖ్యానంతో కార్యక్రమం ఆద్యంతం రక్తి కట్టింది. ప్రతి పాట ఏ రాగమో చెప్తూ చేసిన ఆవిడ విశ్లేషణ ఎంతో బాగుంది.
డాక్టర్ వంశీ రామరాజు, వంశీ, లయన్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కలపటపు, శుభోదయం గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రత్న కుమార్ కవుటూరు, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, రాధిక మంగిపూడి, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం, ఒమాన్ తెలుగు కళా సమితి అధ్యక్షుడు, అనిల్ కుమార్, డా. తెన్నేటి సుధాదేవి, వంశీ అధ్యక్షురాలు వంశీ మేనేజింగ్ ట్రస్టీ, శైలజ సుంకరపల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీలక్ష్మి ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గుంటూరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస రామరాజు వీణపై పి సుశీల నర్తనశాలలో పాడిన ‘జననీ శివకామినీ’ పాటను అద్భుతంగా వినిపించారు. అమెరికా గానకోకిల శారదా ఆకునూరి సుశీల ‘పాటకు పట్టాభిషేకాన్ని’ తన మధురమైన గానంతో సోదాహరణంగా విశ్లేషించారు. ఈ కార్యక్రమాన్ని ఈ కింది లింక్ ద్వారా వీక్షించ వచ్చని నిర్వాహకులు తెలిపారు.
https://youtu.be/ZY6SrAf-IRc