హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సంవత్సర సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదం రోజు రోజుకు బలపడుతున్నది. ఇదే నినాదంతో యూఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 60 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
ఇందులో భాగంగా యూఎస్ఏ నుంచి నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యాతగా 24 ఏప్రిల్ 2022 జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమంలో ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (IAMA)అధ్యక్షుడు, ఆపి (AAPI) పూర్వ అధ్యక్షుడు డా. సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా, చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి ఘంటసాల అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర పాలకలు మొదటి నుంచి దక్షిణాది వారిమీద చిన్నచూపుతో వ్యవహరించారన్నారు. ముఖ్యంగా తెలుగు వారికి అన్ని విధాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఘంటసాలకు భారతరత్న వచ్చేంతవరకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణ కుమారి ఘంటసాల మాట్లాడుతూ.. నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంభం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు.
ఆస్ట్రేలియా, సిడ్నీ నుంచి సంగీత దర్శకుడు, తబలా ప్లేయర్ ఆదిశేషు కోట, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, డెన్మార్క్ నుంచి తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు అమర్నాధ్ పొట్లూరి, ఉగాండా నుంచి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా చైర్మన్ వి.పార్థసారథి, సౌదీ అరేబియా నుంచి సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపికా రవి, UK నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సట్టన్ (TAS) అధ్యక్షుడు నవీన్ జలగడుగు, హంగేరి నుంచి యోగహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, అరవింద కొల్లిపార, యూఎస్ఏ నుంచి శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు ఉపేంద్ర రాచుపల్లి తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఘంటసాలకు భారత రత్న ఇవ్వాలని ముక్త కంఠంతో నినదించారు. కాగా, ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం కింది లింక్లో చూడొచ్చని నిర్వాహకులు సూచించారు.
https://www.change.org/BharatRatnaforGhantasala