Bonalu Festiva | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అరసకేసరి శివన్ ఆలయంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బోనాల పండుగ జరుగగా.. 500 మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. భక్తి గీతాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో, డప్పు వాయిద్యాల నడుమ, అమ్మవారి నామస్మరణలతో పరిసరాలు మారుమోగడంతో కార్యక్రమం హోరెత్తింది.
బోయిన స్వరూప, పెద్ది కవిత, కలకుంట్ల లావణ్య, వేముల సౌహన్యతో పాటు పలువురు మహిళలు కుటుంబ సభ్యులతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. విలువైన ఆధ్యాత్మిక, సాంప్రదాయ ప్రాముఖ్యతను కలిగిన పండుగను నిష్ఠతో నిర్వహించారు. అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం కూడిన బోనాన్ని వండి.. ముగ్గు, పసుపులతో అలంకరించిన కొత్త మట్టి కుండలను అలంకరించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల వేషధారణలతో ఊరేగింపుగా వెళ్లారు.
అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించారు. బోనాల ఉత్సవం సందర్భంగా సింగపూర్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. పండుగ సందర్భంగా సింగపూర్ సమాజానికి సంఘం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు.
బోనాలు వేడుక తెలుగు వారి గొప్ప సంప్రదాయ పండగని, దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేడుక నిర్వాహకులు బోయిన సమ్మయ్యని అభినందించారు.