హైదరాబాద్ : అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. ఘంటశాల శత జయంతి సందర్భంగా భారతరత్న ఇవ్వాలనే నినాదంతో అమెరికా నుంచి శంకర నేత్రాలయ యు.ఎస్.ఎ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 30 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందుకోసం ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
అందులో భాగంగా రెడ్డి ఊరిమిండి నిర్వహణలో 20 మార్చి 2022 జరిగిన అంతర్జాల (zoom) కార్యక్రమంలో బాల ఇందుర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డు కి ఎంపిక అవ్వగా అందులో ఒక్క తెలుగువారికి కూడా దక్కకపోవడం బాధాకరం అన్నారు. అన్నమాచార్య భువనవాహిని సంస్థ అధ్యక్షురాలు, పద్మశ్రీ శోభారాజు పాల్గొని ఘంటసాలకి భారతరత్న ఇవ్వడం ఆ అమరగాయుడికి ఘనమైన నివాళి అని తెలిపారు, ఘంటసాల పాటలలో కొన్ని ఆణిముత్యాలను పాడి ప్రేక్షకులను అలరించారు.
సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్న కుమార్, అట్లాంటా నుంచి శంకర నేత్రాలయ యు.ఎస్.ఎ. పాలక మండలి సభ్యులు శ్రీని రెడ్డి వంగిమళ్ళ, దక్షిణ ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరు, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ కడించెర్ల, ఖతార్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షుడు ఉసిరికల్ల తాతాజీ, నార్వే నుంచి వీధిఅరుగు అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల, యూఏఈ నుంచి తెలుగు తరంగిణి అధ్యక్షుడు వెంకట సురేష్, లండన్ నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ ఉపాధ్యక్షుడు రాజేష్ తోలేటి తదితరులు పాల్గొని ఇది ఇది 15 కోట్ల తెలుగువారందరికి ఆత్మ గౌరవానికి సంభందంచిన విషయం అన్నారు.
ఈ బృహత్ కార్యక్రమంలో టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరు, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేసి ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరిని సంఘటితం చేస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.