వాషింగ్టన్ డిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF-DC) ఆధ్వర్యంలో 20వ బతుకమ్మ, దసరా సంబరాలు ఆదివారం వర్జీనియా అల్డీలోని జాన్ చాంపే హై స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. అమెరికాలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు వేలాది మంది తెలుగు ప్రజలు, స్థానికులు హాజరై తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించారు.
ఈ వేడుకలకు పద్మభూషణ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని కేఎస్ చిత్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె అతిథ్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే తెలంగాణ జానపద గాయకుడు భిక్షు నాయిక్ తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. బతుకమ్మ ప్రదర్శన, జానపద నృత్యాలు, సాంప్రదాయ గీతాలు, దసరా ఉత్సవాలతో వేదిక సందడి చేసింది. అశ్విని చిట్టిమల్ల గ్రూప్ బతుకమ్మ ప్రాంగణాన్ని అందంగా రంగు రంగుల వస్త్రాలతో అందంగా అలంకరించారు .
మంజుల మద్దికుంట,శ్రీలక్ష్మిపోలోజు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు, పిల్లలు, యువత అందరూ చురుకుగా పాల్గొని అబ్బుర పరిచే నృత్యాలు ప్రదర్శించారు. మహిళలు , పిల్లలు రంగురంగుల బతుకమ్మలతో కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. అవంతిక నక్షత్రం మీడియా చైర్గా రూపొందించిన బతుకమ్మ టీజర్ పలువురిని అబ్బుర పరచింది. ఈ వేడుకలను మంజుషా నాంపల్లి , రుద్ర భీమ్రెడ్డి కన్వీనర్లుగా సమన్వయం చేయగా, పూర్వ అధ్యక్షులు కవిత చల్లా, సలహాదారులుగా వినయ సూరినేని, కల్పనా బోయినపల్లి సహకరించారు.
స్థానిక రెస్టారెంట్ వారిచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత విందు ద్వారా వేల కుటుంబాలు స్నేహభావంతో కలసికట్టుగా భోజనం చేశారు. ఈ సందర్భంగా పలువురు అమెరికాలో ఇంత భవ్యంగా జరుగుతున్న తెలంగాణ ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడం గర్వకారణమని పేర్కొన్నారు.
స్పాన్సర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని TDF DC ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
సాంస్కృతిక వేడుకలకు అతీతంగా, గ్రామీణ తెలంగాణలో రైతులు, యువత, మహిళలు, ఆరోగ్య రంగానికి సంబంధించిన కార్యక్రమాలను కొనసాగిస్తూ, సానుకూల మార్పు మరియు సమాజాభివృద్ధి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది TDF USA.