Avadhanam | ‘తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం’ అన్నారొక సినీకవి. అది నిజమని ఆహూతులందరూ ముక్తకంఠంతో అనేలా అద్భుతంగా జరిగింది ఆస్ట్రేలియాలో అవధానార్చన. తటవర్తి గురుకులం వారు మెల్బోర్న్ నగరంలో డిసెంబరు 3న నిర్వహించిన అవధానార్చన కార్యక్రమానికి ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రంలో భాషాభిమానులందరూ తరలివచ్చి తెలుగు భాషపై ప్రవాసులలో ఉన్న ప్రేమను చాటారు.
ఎనిమిది మంది పృచ్ఛకులు ఒకేసారి అడిగిన ప్రశ్నలకు ఛందస్సు వ్యాకరణం సమ్మతించేలా పద్యాలు పూరణ చేస్తూ ధారణతో పూర్తైన ఈ అవధానం తమ 56వ అవధానంగా ఆస్ట్రేలియా ప్రథమ అవధాని తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి చెప్పారు.
“సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్” అనే సమస్యతో ప్రారంభమైన అవధానం, దత్తపది పదాలుగా క్రికెట్టు, రగ్బీ, పుటబాల్, టెన్నిస్, వర్ణన అంశంలో ప్రవాసంలో తెలుగు బోధనను భారతంలో అర్జునునితో పోల్చటం, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగాలతో ఆద్యంతం రసమయంగా సాగింది.
‘సంధ్యా సంధ్యా యనకో’ అంటూ సంధ్య అనే అమ్మాయి తలపులే దైవంగా ఉంటూ ఆ సంధ్యావందనమే నిత్యం కాకుండా చదువుమీద దృష్టిపెట్టమని సమకాలికమైన విధానంలో సమస్యను పూరించడం, బాణపు శబ్దాల నుండి రగ్బీ , నిలుపుటబాలలీలలో పుటబాల్, కలుపుటెన్నీసరణిలో టెన్నీసు తీసుకువచ్చిన విధానానికి ప్రేక్షకులు ఆశ్చర్యానందాలు వ్యక్తం చేసారు. మాతృభాషేశ్వరీ వర్ణనలో శార్దూల పద్యం, నిషిద్ధాక్షరిలో ఎలాన్ మస్క్ గురించి చెప్పిన సరదా పూరణ, న్యస్తాక్షరిలో క్లిష్టమైన కవిరాజవిరాజితం పద్యం , ఇలా అద్భుతమైన పూరణలు నాలుగు గంటలపాటు ఆహూతులను కుర్చీలకు కట్టిపడేసాయి.
సినిమాసంగీత కార్యక్రమాలు మాత్రమే కాదు మంచి సాహిత్యాన్ని కూడా ఆదరిస్తారు ప్రేక్షకులు అని నిరూపిస్తూ సాగిన ఈ అవధానార్చన భారతదేశంలో గోవూరులో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి అంకితంగా చేయడం గమనార్హం. చంటిపిల్లలను ఎత్తుకుని మరీ కార్యక్రమాన్ని ఆసాంతం ఆస్వాదించిన ప్రేక్షకులు ప్రవాసంలో తెలుగుభాషా వికాసానికి నిదర్శనం. తటవర్తి గురుకులం, మోగంటి కుటుంబాల నుండి పాల్గొన్న వారందరికీ సన్మానంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
సంచాలకులుగా ఆస్ట్రేలియాలో ప్రముఖ పద్యకవి డాక్టర్ వేణుగోపాల్ రాజుపాలెం, సమస్యాపూరణం యామిని చతుర్వేదుల, దత్తపది మనోజ్ మోగంటి , వర్ణన అమరేందర్ అత్తాపురం, నిషిద్ధాక్షరి శ్రీనివాస్ బృందావనం, న్యస్తాక్షరి రాజశేఖర్ రావి, ఆశువు రంజిత పుణ్యమూర్తుల, చిత్రానికి పద్యం సీతామహాలక్ష్మి దేవరపల్లి, అప్రస్తుతం పల్లవి యలమంచిలి నిర్వహించారు.
కార్యక్రమ నిర్వహణలో సహాయం చేసిన ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్, స్వీట్ మేజిక్ వారిని నిర్వాహకులు సత్కరించారు. ఇటువంటి అవధానార్చనలు మరిన్ని జరగాలని కోరుతూ అవధానార్చనకు మెల్బోర్న్ తెలుగు భాషాభిమానులు బ్రహ్మరథం పట్టారు.