సింగపూర్: వాగ్గేయకారుడు అన్నమయ్య జయంతి సందర్భంగా తెలుగు భాగవత ప్రచార సమితి శతగళార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. సింగపూర్ నుంచి నాలుగో అన్నమయ్య శతగళార్చన ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా నిర్వహించారు. మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు పాడిన అన్నమయ్య కీర్తనలు తెలుగువారందరిని అలరించింది. అదేవిధంగా ఈ వేడుకల్లో 25 మంది పిల్లల కీర్తనలను ప్రత్యక్షప్రసారం చేశారు. అలాగే 180 మందికి పైగా పాడిన ఏడు సప్తగిరి సంకీర్తనలను శతగళార్చనగా కూర్చి.. వాటిని ఈ కార్యక్రమం ద్వారా విడుదల చేశారు. పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి తమ కీర్తనలతో అలరించారు.
ఈ వార్షిక కార్యక్రమానికి చిన్నారులు మౌర్య, దంటూ శ్రీయలు వ్యాఖ్యానాన్ని అందించారు. భాగవత ప్రచార సమితి వ్యవస్థాపకులు ఊలపల్లి సాంబశివరావు అన్నమయ్య ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికి తెలుగు భాగవత ప్రచార సమితి ధన్యవాదాలు తెలిపింది.