అమెరికా గడ్డపై రికార్డ్ స్థాయిలో 18 వేల మంది తెలుగు వారు హాజరు
తెలుగు రాజకీయ, సినీ ప్రముఖులతో కళకళలాడిన అట్లాంటా
అమెరికా అభివృద్ధిలో తెలుగువారి సేవలను మరిచిపోము
జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్
ATA | నవత, యువత, భవిత నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా – 2024 వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా జూన్ 7 నుండి 9 వరకు జరిగిన 18వ ఆటా కన్వెన్షన్కు 18 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్ సమావేశం జరిగింది. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, హీరో శ్రీకాంత్, హీరోయిన్ మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి హాజరయ్యారు.
జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వారు తోడ్పాటును అందిస్తున్నారని జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ కొనియాడారు. అభివృద్ధిలో ఇండియా తమకు కీలక భాగస్వామి అన్నారు. ముఖ్యంగా తెలుగు వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు.
నవత, యువత, భవిత అనే లక్ష్యాలతో ఈ సారి కన్వెన్షన్ నిర్వహించామని ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, అధ్యక్షురాలు మధు బొమ్మినేని అన్నారు. వీటికి ఆటా అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ఇంత పెద్ద కన్వెన్షన్ చేయడం అంత తేలిక కాదని.. దీన్ని ముందుకు తీసుకువెళ్తామని ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా అన్నారు. అనితర సాధ్యం అనుకున్నది సాధ్యమైంది అని ప్రెసిడెంట్ మధు బొమ్మినేని అన్నారు. చరిత్రను తిరగరాసిన ఈ కన్వెన్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆటా నవల పోటీలు.. త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్ చాలా విన్నూత్నంగా, యువతను ఆకర్షించే విధంగా సాగింది. ఈలలు గోలలతో మార్మోగిపోయింది. భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్ హనమంతరావు హాజరయ్యారు. యూత్ కమిటీ సమావేశాలు ఈసారి హైలైట్గా నిలిచాయి. ఏఐ సెమినార్, సెలబ్రిటీలతో క్యూ & ఏ, వివిధ విషయాలపై డిబేట్స్ వినోదాత్మకంగా సాగాయి. ఉమెన్స్ ఫోరమ్లో మహిళా సాధికారత, గృహ హింస వంటి అంశాలు చర్చించారు. మెహ్రీన్, దేవరకొండ బ్రదర్స్తో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించారు.
బిజినెస్ ఫోరమ్లో రాష్ట్ర మంత్రులు, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు, తెలంగాణ ఐటీ అడ్వైజర్ రవి తంగిరాల తదితరులు పాల్గొనగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా మోడరేటర్గా వ్యవహరించారు. ఎప్పుడూ లేని విధంగా బిజినెస్ పిచ్చింగ్ జరిగింది. టెక్నాలజీ, ట్రేడ్ ఫోరమ్లో ఏఐ వంటి అత్యాధునిక విషయాలపై చర్చ జరిగింది. ఎన్నారై కమిటీ ఇమ్మిగ్రేషన్, టాక్స్, ఎన్నారై ఇష్యూస్ సెమినార్లు, ఆంధ్రా, తెలంగాణా, అమెరికా పొలిటికల్ ఫోరంలలో వివిధ విషయాలపై చర్చ ఆసక్తిగా సాగింది. సాహిత్య ఫోరమ్లో కథా సాహిత్యం, సమకాలీన నవల, పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. అలానే, అష్టావధానం రకరకాల చిక్కుముడులతో రసవత్తరంగా సాగింది. తనికెళ్ళ భరణి, గంగాధర శాస్త్రి ప్రవచనాలు అద్భుతంగా సాగాయి.
బ్యూటీ ప్రజెంటేషన్స్ అట్టహాసంగా జరిగాయి. గెలిచిన వారికి దేవరకొండ బ్రదర్స్ క్రవునింగ్ చేశారు. జీవిత భాగస్వాములను కోరుకునే వారు, వారి తల్లిదండ్రులు ఆటా మ్యాట్రిమోనీకి జనం క్యూ కట్టారు. అధిక సంఖ్యలో హాజరయ్యారు. మరోవైపు ప్రధాన కార్యక్రమంలో దాజీ శ్రీ కమలేష్ పటేల్ పాల్గొని ప్రేక్షకులకు సందేశo ఇచ్చారు. థమన్ మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన 17 మందికి ఆటా అవార్డులు ప్రదానం చేశారు. మాజీ అధ్యక్షులు భువనేష్ బూజాల, హరి ప్రసాద్ రెడ్డి లింగాల, రామకృష్ణారెడ్డి ఆల, సాయినాథ్ బోయపల్లి, విజయ్ కుందూరు, రఘువీరారెడ్డిలకు అవార్డులు, ఆటా లైఫ్టైమ్ సర్వీస్ అవార్డును డాక్టర్ రాజేశ్వర్ రావు టేక్మాల్కు అందజేశారు. తె
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సన్మానం చేశారు. ఆటా మహా సభలు అట్లాంటాలో జరగడం ఇది మూడోసారి. 2000, 2012లో అట్లాంటాలో ఆటా సమావేశాలు జరగగా ఇప్పుడు మళ్లీ పదేళ్ల తరవాత జరిగాయి. కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి.