హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు తధ్యమని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్కే ఓట్లేస్తామని, గెల్లుదే గెలుపని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు. ఉపఎన్నికల్లో గెల్లు గెలుపుకోసం ఎన్నారై టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుందని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం చేశామని, ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటామని తేల్చి చెబుతున్నారని పేర్కొన్నారు.
గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ఎన్నారై టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధుతో దళిత వాడల్లో పండుగ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ఈ పథకంతో తమ జీవితాలు మారిపోయాయని, గెల్లు శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించుకుని ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపుకుంటామని దళిత సోదరులు చెప్తున్నట్లు తెలిపారు.
హుజూరాబాద్లో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటు వేస్తే హుజూరాబాద్కు వచ్చే లాభం లేదన్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ బీజేపీ డ్రామాలు చేస్తున్నదని, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు. అందువల్ల ప్రజలంతా వాటిని నమ్మకుండా ఓటుతో వారికి తగిన బుద్ధి చెప్పాలని అనిల్ కోరారు. ఎన్నారై టీఆర్ఎస్ నాయకుల ప్రచారానికి సహకరించి ప్రోత్సహించిన మంత్రి హరీశ్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు.