కమ్మర్పల్లి, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ తెస్తామన్న మార్పు అంటే మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేయడమేనా? అని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మోర్తాడ్లో వేలాది నిరుద్యోగ యువకులకు మేలు చేసే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కక్షపూరిత వైఖరిగా పేర్కొన్నారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వేలాది మంది నిరుద్యోగులు గల్ఫ్ దేశాలకు వెళ్తారని పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యంతో మంచి జీతం సంపాదించాలనే ఆశయంతో మోర్తాడ్, కరీంనగర్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో కేసీఆర్ ప్రభుత్వ హయాం లో తాను మంత్రిగా ఒక్కోదానికి రూ.5కోట్ల చొప్పున న్యాక్ ద్వారా మంజూరు చేయించానని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్ భూమిని మంజూరు చేయగా.. వాటి పనులకు తానే శంకుస్థాపన చేశానని, టెండర్లు సైతం పూర్తయ్యాయని వివరించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, రాడ్ బెండింగ్ తదితర విభాగాల్లో ఏటా 2వేల మందికి వృత్తిశిక్షణనిచ్చి న్యాక్ సర్టిఫికెట్లు అందిస్తుండడంతో మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఉన్నఫలంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేసి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మోర్తాడ్లో మొదలుపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కాపాడుకోవడానికి నిరుద్యోగ యువత కదిలివచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు గత ప్రభుత్వ హయాంలో తన ద్వారా మంజూరై ఇంకా ప్రారంభం కానీ అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఉన్నదన్నారు. కొత్తగా మంజూరై పనులు మొదలుకానీ కుల సంఘాల భవనాలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలను కాపాడుకునేందుకు ఆయా గ్రామాలకు చెందిన యువకులు, కుల సంఘాలు, వీడీసీలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యేగా ప్రార్థిస్తున్నానని కోరారు.