Suicide | నస్రుల్లాబాద్, ఆగస్టు 29 : అప్పుల బాధతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నస్రుల్లాబాద్ మండలం బస్వాయిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ ఇన్చార్జి ఎస్సై వెంకట్రావు కథనం ప్రకారం.. బస్వాయిపల్లి గ్రామానికి చెందిన పిట్లం విట్టల్ (28) అనే యువకుడు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. 2023 సంవత్సరంలో ఇల్లు నిర్మాణం మొదలు పెట్టుకుని రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. ఆ అప్పును తీర్చడానికి ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.13 లక్షల వరకు లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్ ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఇల్లును కంపెనీవారు సీజ్ చేశారు.
ఇల్లును సీజ్ చేసినప్పటినుండి ఇంట్లో వారికి నేను చనిపోతానని బెదిరింపులకు పాల్పడేవాడు. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు పొలం కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా దొరకకపోవడంతో మృతుడి మామ సుంకరి ఎల్లయ్య సీజ్ చేసిన ఇల్లు వద్దకు వెళ్లి చూడగా ఇంట్లో ఫోన్ రింగ్ అవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఊయల కోసం కట్టిన చీరకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.