విద్యా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మన ఊరు -మనబడి/మన బస్తీ- మనబడి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అదనపు తరగతి గదుల నిర్మాణం, డిజిటల్ గదులు, ప్రహరీ, వంట గది, గ్రీన్ చాక్ బోర్డు ఏర్పాటు, భోజనశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నిచర్ సౌకర్యం కల్పించి కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దాలని సర్కారు యోచిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడుతలో భాగంగా 407 పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో 341 గ్రామీణ ప్రాంతాలు, మిగిలిన 66 పాఠశాలలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. యాజమాన్య కమిటీ ద్వారా ఆయా పాఠశాలల్లో అవసరాలను గుర్తించి కలెక్టర్ ద్వారా నియమించిన నిర్వహణ ఏజెన్సీలు అవసరాలకు అనుగుణంగా అంచనాలను రూపొందించాయి. ప్రస్తుతం తొలి విడుతలో ఎంపికైన బడులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో పనులు చేపడుతుండగా రానున్న మూడేండ్లలో అన్ని పాఠశాలలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి.
నిజామాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి బృహత్తర కార్యక్రమం పకడ్బందీగా అమలవుతున్నది. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి సదుపాయాలు మెరుగునకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 407 పాఠశాలలను ఇందుకోసం గుర్తించారు. మొదటి విడుతలో మౌలిక వసతుల మెరుగుదలకు రూ.170కోట్లు నిధులు అవసరం అవుతుందని జిల్లా యంత్రాంగం అంచనాలు సైతం సిద్ధం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. మన ఊరు మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో 72,801 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరందరికీ మౌలిక వసతుల కల్పనతో మెరుగైన విద్య దరి చేరబోతున్నది. 2022-23 విద్యా సంవత్సరం లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1156 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో లక్షా 10వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. మొదటి విడుతలో ఎంపికైన స్కూళ్లలో వసతుల కల్పన పూర్తయితే దాదాపు 65శాతం మందికి మేలు జరుగుతుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడి / మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తొలి విడుతలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 407 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 341 ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లోనివి కాగా మిగిలిన 66 స్కూళ్లు పట్టణాల్లో నెలకొని ఉన్నాయి. పాఠశాల యాజమాన్య కమిటీ ద్వారా ఆయా పాఠశాలల్లో అవసరాలను గుర్తించబడిన తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా నియమించిన నిర్వహణ ఏజెన్సీ ఆ అవసరాలకు తగ్గట్లుగా అంచనాలను రూపొందించారు. ఆ అంచనాలకు పరిపాలనా అనుమతులు మంజూరైన తర్వాత సాంకేతిక అనుమతులు మంజూరు చేశారు.
అన్ని పాఠశాలల్లో రివాల్వింగ్ ఫండ్ కోసం ఒక బ్యాంక్ అకౌంట్ను తెరిచారు. విరాళాలకు ప్రత్యేకంగా మరొక బ్యాంక్ అకౌంట్ను తెరిచారు. ఇప్పటి వరకు 293 పాఠశాలలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా 106 కాంట్రాక్టర్ల ద్వారా పనులు నిర్వహించేలా పరిపాలన, సాంకేతిక అనుమతులు మంజూరైనట్లు విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. 293 పాఠశాలలకు రూ.6.62 కోట్లు నిధులను అడ్వాన్సు రూపంలో, చేపట్టిన పనుల ఎంబీ రికార్డుల ప్రకారం ఆయా పాఠశాలల బ్యాంక్ అకౌంట్లకు బదలాయింపు సైతం జరిగింది.
స్కూళ్లను బాగు చేయడంలో ప్రభుత్వం ముందడుగు వేయగా స్థానికంగా విరాళాల ద్వారా కూడా వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వ బడుల్లో చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకున్న వారి నుంచి పాఠశాలల అభివృద్ధికి ప్రోత్సాహం అందుతున్నది. వారిచ్చే విరాళాల ఆధారంగా స్కూల్ బిల్డింగ్, క్లాస్ రూమ్లకు వారి తల్లిదండ్రులు లేదంటే వారికి ఇష్టమైన వ్యక్తుల పేర్లను సముచిత స్థానంలో ప్రాధాన్యం కల్పించేందుకు సైతం సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఎన్ఆర్ఐలు, ఇతరులు ఎవరైనా రూ.2లక్షల వరకు విరాళాలు ఇస్తే వారి పేర్లను తరగతి గది, రూ.10లక్షలకు పైగా విరాళాలు ఇస్తే ఆయా పాఠశాల ప్రధాన ముఖ ద్వారం ఎదురుగా నేమ్ బోర్డులను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకు మాక్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చక్కని ఉదాహరణగా నిలుస్తున్నది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆయన సోదరుడు ఎన్ఆర్ఐ బిగాల మహేశ్ గుప్తా ఇరువురు సొంతంగా రూ.కోటి అందించారు. వారు చదువుకున్న స్కూల్ రుణాన్ని తీర్చుకోవడంతో పాటు రూ.5 కోట్లను ప్రభుత్వం ద్వారా మంజూరు చే యించారు. తద్వారా వీరి తండ్రి పేరును స్కూల్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి కూడా అందించింది. ఇదే రకంగా కామారెడ్డి జిల్లాలోనూ ప్రముఖ బిల్డర్ సుభాష్ రెడ్డి ఔదార్యాన్ని సర్కారు మెచ్చి ఇదే రకమైన ప్రోత్సాహాన్ని అందించింది. ఇలా జీవితంలో ఉన్నతంగా ఎదిగిన వారందరి సహాయ, సహకారాలను సైతం ఈ క్రతువులో ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తున్నది.
మన ఊరు మన బడిలో ఎంపికైన స్కూళ్లలో సకల వసతులను కల్పించనున్నారు. ఎంపీడీవో, ఎంఈ వో, ఇంజినీరింగ్, పంచాయతీ కార్యదర్శి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ద్వారా గుర్తించిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టి పూర్తి చేస్తారు. పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా నిధులు వెచ్చిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. అదనపు తరగతుల నిర్మాణం, డిజిటల్ గదులు, ప్రహరీ, వంట గది, గ్రీన్ చాక్ బోర్డు ఏర్పాటు, భోజనశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నిచర్ సౌకర్యం కల్పించి కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దాలని సర్కారు యోచిస్తున్నది. తొలి విడుతలో ఎంపికైన బడులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో పనులు చేపడుతుండగా ఇవన్నీ పూర్తయితే రాబోయే మూడేండ్లలో పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి.
నా పేరు రియాన్. సులేమాన్నగర్ ఉర్దూ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. గతంలో మా బడిలో నీళ్లు కూడా ఉండేవి కావు. కరెంటు ఉండేది కాదు. చిన్నచిన్న పనులకు కూడా ఇంటికి వెళ్లి వచ్చేవాళ్లం. ఇప్పుడు మా బడిని చూస్తే భలే సంతోషంగా ఉంది. కొత్త బడిలెక్క తయారు చేసిండ్రు. బడికి కలర్ వేసిండ్రు. ప్రతి క్లాసులో కరెంటు పెట్టిండ్రు. నీటి సదుపాయం కల్పించిండ్రు.