నిజామాబాద్ క్రైం/కామారెడ్డి (నమస్తే తెలంగాణ) ఆగస్టు 21 : నూతన మద్యం పాలసీ 2023-25 ప్రకారం లక్కీ డ్రా పద్ధతిలో లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కామారెడ్డిలో జితేశ్ వీ పాటిల్ పర్యవేక్షణలో ప్రక్రియ సాగింది. నిజామాబాద్ నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో లిక్కర్ షాపులకు దరఖాస్తులు చేసుకున్న వారి సమక్షంలో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించారు. పోలీసుల బందోబస్తు మధ్య ఉదయం 10 గంటల నుంచి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్, మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న 102 మద్యం షాపులకు డ్రా నిర్వహించారు. 102 మంది దుకాణాలకు గాను 3,783 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. షాపులు దక్కిన వారు ముందుగా సూచించిన నిబంధన ప్రకారం వైన్స్ షాపు మొదటి కిస్తు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, డిప్యూటీ కమిషనర్ ఆర్.కిషన్, సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని మద్యం షాపులకు ఉత్కంఠ మధ్య లక్కీ డ్రా సాగింది. పట్టణంలోని రేణుకాదేవి ఫంక్షన్ హాల్ లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 49 మద్యం దుకాణాలకు లక్కీ డ్రాను కలెక్టర్ జితేశ్ వీపాటిల్ నిర్వహించారు. 48వ నంబర్ దుకాణానికి రెండు దరఖాస్తులు మాత్రమే రావడంతో లక్కీ డ్రా నిర్వహించలేదని తెలిపారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్రరాజు, సీఐ విజయ్కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
జిల్లాలోని 49 దుకాణాల కోసం మొత్తం 2174 దరఖాస్తులు రాగా 38 మంది పురుషులు, 10 మంది మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. మహిళలు సైతం లక్కీ డ్రాలో ఉత్సాహంగా పాల్గొన్నారు.