తాడ్వాయి, జూన్ 24 : మండలంలోని నందివాడ గ్రామంలో పొదుపు సంఘాల మహిళలు వీవోఏ బాబాగౌడ్ వద్ద శనివారం బైఠాయించారు. వీవోఏ నుంచి డబ్బులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామంలో 21 డ్వాక్రా మహిళా పొదుపు సంఘాలు పనిచేస్తున్నాయి. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, తిరిగి చెల్లించేలా చూసేందుకు సీసీగా సాయిబాబా, వీవోఏగా బాబాగౌడ్ను అధికారులు నియమించారు. మహిళలకు తెలియకుండా వారి పేర్ల మీద రుణాలు తీసుకొని కుటుంబసభ్యుల ఖాతాల్లోకి రూ. 36 లక్షలను దారి మళ్లించి కాజేసినట్లు మహిళలకు తెలియడంతో కలెక్టర్కు ఇటీవల ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై సంబంధిత అధికారులు గ్రామంలో విచారణ చేపట్టగా.. రూ. 36 లక్షలు వీవోఏ బాబాగౌడ్ తన సొంతానికి వాడుకున్నట్లు తేలింది. ఈ డబ్బులను తిరిగి మహిళా సంఘాల పేరు మీద బ్యాంకులో జమచేయాలని పీడీ సాయన్న సమక్షంలో నిర్వహించిన గ్రామసభలో తీర్మానించారు. సభ నిర్వహించి వారం రోజులు అవుతున్నా వీవోఏపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు డబ్బులు రికవరీ చేయలేదు. దీంతో డ్వాక్రా సంఘాల మహిళలు వీవోఏ ఇంటి ఎదుట బైఠాయించారు. డబ్బులు రికవరీ చేస్తామని అధికారులు మహిళలకు సర్దిచెప్పినా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి ముందే బైఠాయించారు. అధికారుల నిర్లక్షంతోనే వీవోఏ డబ్బులు చెల్లించడం లేదని, డబ్బులు కట్టేవరకు ప్రతిరోజూ నిరసన తెలుపుతామని వారు స్పష్టంచేశారు.