ఇందూరు/ఖలీల్వాడి, జనవరి 11: సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులే కాదు.. నోరూరించే పిండి వంటలూ ఈ పండుగ ప్రత్యేకత. ఒకప్పుడు సంక్రాంతి అనగానే ఊళ్లల్లో వారం ముందు నుంచే పిండి వంటల హడావిడి మొదలయ్యేది. ఊరంతా పిండి వంటల ఘుమఘుమలు వచ్చేవి. ఒకరింట్లో పిండి వంటలు చేస్తున్నారంటే చుట్టుపక్కల వాళ్లు నలుగురు కలిసి వారికి సాయం చేసేవారు. కొన్నేండ్లుగా పిండి వంటలు స్వగృహాల్లో కాకుండా స్వగృహ ఫుడ్స్లో తయారవుతున్నాయి. ప్రతి ఇంట్లో గారెలు, బూరెలు, చేగొడీలు, అరిసెలు, సకినాలు ఇలా ఎన్నో సంక్రాంతికి చేసుకునే వాళ్లు. ఇప్పుడు అంతా బిజీ లైఫ్.. వంట చేసుకునే తీరిక కూడా లేకుండా పోయింది. ఇలాంటి వాటిని వ్యాపారంగా మలుచుకొని నగరంలో కొందరు పిండి వంటలు చేస్తూ పండుగలు, శుభకార్యాల సమయంలో కస్టమర్లకు కావాల్సినవి చేసి విక్రయిస్తున్నారు.
వ్యాపారంతో పలువురికి ఉపాధి..
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్కు చెందిన కిష్టగారి శోభ నిజామాబాద్లో స్థిరపడ్డారు. మొదట చీరెల వ్యాపారం చేసిన కృష్ణశోభ తర్వాత తిరుమల హోమ్ ఫుడ్స్ పేరుతో పిండి వంటల వ్యాపారం ప్రారంభించారు. పదమూడేండ్ల క్రితం మొదలైన తిరుమల హోమ్ఫుడ్స్ ప్రస్తుతం నగరంలోని వినాయక్నగర్ హన్మాన్ మందిరం, ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ రైతుబజార్, కంఠేశ్వర్లోని మురళీకృష్ణ ఆలయం వద్ద బ్రాంచీలకు విస్తరించారు. పిండి వంటల నిర్వహణలో 15మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఒక్కో మహిళకు రోజుకు రూ.500 నుంచి రూ.600 కూలి ఇస్తూ ఆర్థిక చేయూతనందిస్తున్నారు.
హోం డెలివరీ సౌకర్యం కల్పిస్తాం..
పిండివంటలు ఒక్కరోజు ముందు అయిపోతున్నాయి. రాబోవు రోజుల్లో హోమ్డెలివరీ కూడా పెట్టాలనే ఆలోచన లో ఉ న్నాం. విదేశాలకు కూడా మేము తయారుచేసిన పిండి వంటలు తీసుకెళ్తున్నారు. ఆర్డర్ ఇచ్చి విదేశాలకు పంపిస్తున్నారు. ఇంట్లో చేసినట్లుగానే సుచీ శుభ్రత పాటించడంతో మా పిండి వంటలకు గిరాకీ బాగుంటుంది. వర్కర్స్ పూర్తిస్థాయిలో దొరకకపోవడంతో 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
విదేశాలకూ ఇక్కడి పిండి వంటలు
నిజామాబాద్లోని పలుచోట్ల చేస్తున్న పిండి వంటలు విదేశాలకూ వెళ్తున్నాయి. నాణ్యత, శుభ్రతతో కూడిన వంటల రుచి బాగుండడంతో ఎక్కువ సంఖ్యలో రెడీమేడ్ పిండి వంటలను కొనుగోలు చేసేందుకు జనం శ్రద్ధ చూపుతున్నారు. విదేశాల్లో ఉండే కుటుంబసభ్యుల కోసం చాలా మంది ఇక్కడి దుకాణాల్లో ముందుగా ఆర్డర్ ఇచ్చి పిండి వంటలు చేయించుకొని తీసుకెళ్తుండడం విశేషం. ఇలా ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, దుబాయ్ తదితర దేశాలకు నిజామాబాద్ నుంచి పిండి వంటలు తరలుతున్నాయి.