నిజాంసాగర్, ఫిబ్రవరి 20: స్వయం సహాయక సంఘాల సభ్యుల పొదుపు డబ్బులతోపాటు రుణాల కిస్తులను సైతం స్వాహా చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలకేంద్రంలో కలకలం రేపింది. సభ్యులు చెల్లించిన డబ్బులను ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలు సొంత అవసరాలకు వాడుకోగా, బాధిత మహిళలు సోమవారం రోడ్డెక్కారు. మహిళా సంఘాలు జమచేసే డబ్బులను ఎస్బీఐ పరిధిలోని కస్టమర్ సర్వీస్ పాయింట్లోనే చెల్లించాలని బ్యాంకు అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో అప్పటి నుంచి స్వయం సహాయక సంఘాలకు చెందిన డబ్బులను సర్వీస్ పాయింట్లోనే కడుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని హసన్పల్లి గ్రామానికి చెందిన 11 సంఘాల డబ్బులను ప్రతినెలా చెల్లించగా, కేంద్రం నిర్వహాకురాలు ఓ కాగితంపై రాసి ఇచ్చేది.
ఆ డబ్బులను ఖాతాలో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నది. ఈ విషయం ఆరు నెలల కిందట బయటపడడంతో హసన్పల్లి గ్రామానికి చెందిన మహిళలు నిలదీశారు. దీంతో 3 సంఘాలకు చెందిన రూ. 10 లక్షల వరకు చెల్లించింది. మరి కొన్ని సంఘాలకు చెందిన రూ.26 లక్షలు చెల్లించాల్సి ఉండగా నిర్వాహకురాలు స్పందించకపోవడంతో బాధిత సభ్యులు సోమవారం నిజాంసాగర్ మండల కేంద్రానికి తరలివచ్చారు. బ్యాంకు, ఐకేపీ కార్యాలయానికి వెళ్లారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. నగలు, ఆస్తులు అమ్ముకొని డబ్బులు చెల్లించినప్పటికీ తమ అప్పు అలాగే ఉన్నదని అధికారులు అంటున్నారని తెలిపారు.
ఈ విషయమై ఐకేపీ ఏపీఎం రాంనారాయణగౌడ్ను వివరణ కోరగా.. మహిళలు ప్రతి నెలా సీఎస్పీలో డబ్బులు చెల్లించినట్లు రసీదులు ఉన్నాయని, మినెట్స్ బుక్, రిజిస్టర్లలో కూడా వివరాలు నమోదు చేశారని, 8 సంఘాలకు చెందిన రూ.26 లక్షలను సర్వీస్పాయింట్ నిర్వాహకురాలు దుర్వినియోగం చేసినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, విచారణ జరిపిన సీఎస్పీని రద్దు చేశారని తెలిపారు. మహిళా సంఘాల సభ్యుల వెంట వారి కుటుంబ సభ్యులు, సర్పంచ్ సంగమేశ్వర్గౌడ్, గ్రామ పెద్దలు గుండయ్య, ఊశయ్య తదితరులు నిజాంసాగర్కు తరలివచ్చారు.