బాన్సువాడ, డిసెంబర్ 27 : బాన్సువాడ సమీపంలో ఉన్న పెద్ద పూల్ వాగులో సోమవారం సాయంత్రం చిన్నారులు యువరాజ్ (4), కుమార్తె అనన్య (6 నెలలు)ను తల్లి జాదవ్ అరుణ వాగులో పడేసి తాను ఆత్మహత్యకు యత్నించగా పిల్లలు మృత్యువాత పడగా అరుణ ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.. కేసుకు సంబంధించిన వివరాలను బాన్సువాడలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జగన్నాథ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని గొల్ల గుట్టతండా నాగారానికి చెందిన అరుణకు ఆరు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గీర్ తాలుకాలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ మోహన్తో వివాహం అయ్యింది. భర్త మోహన్ వేధింపులు తాళలేక అరుణ కొంతకాలంగా గొల్లగుట్ట తండాలోనే ఉంటున్నది. భర్త మోహన్ ఫోన్ చేసి ఇంటికి రావాలని తెలిపాడు. భర్త వేధింపులకు భయపడిన అరుణ సోమవారం బాన్సువాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని బయల్దేరింది. కుమారుడు యువరాజ్, కుమార్తె అనన్యను తీసుకొని బస్సులో బాన్సువాడకు వచ్చింది.
బస్సు దిగి పెద్ద పూల్ బ్రిడ్జి వద్దకు తన ఇద్దరు పిల్లలతో వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో నమోదయ్యింది. ముందుగా ఇద్దరు పిల్లలను వాగులో తోసేసిన అరుణ అనంతరం తాను కూడా నీటిలో దూకేసింది. పిల్లలు నీటిలో మునిగి మృత్యువాత పడగా.. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో ప్రాణాలతో బయట పడింది. పోలీసుల దర్యాప్తు, సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన అనంతరం అరుణను ప్రశ్నించగా చిన్నారులను వాగులో పడేసిన విషయాన్ని ఒప్పుకుందని డీఎస్పీ వివరించారు. అరుణ వద్ద ఉన్న బస్సు టికెట్లను పరిశీలించి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. పోలీసులకు అరుణ తప్పుడు సమాచారం అందించడంతో పాటు, చిన్నారులను చంపిన విషయంలో భర్త మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. భర్త మోహన్ వేధింపుల కారణంగానే చిన్నారులతో పాటు అరుణ చనిపోయేందుకు ప్రయత్నం చేసిందని వెల్లడించారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన పట్టణ సీఐ మహేందర్ రెడ్డిని డీఎస్పీ అభినందించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఓంకార్, గంగాధర్ ఉన్నారు.