బానువాడ రూరల్, మార్చి 24 : అకాల వర్షం, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకూ రూ. 10వేల చొప్పున అందిస్తామని ప్రకటించి రైతులకు ఆపద్బాంధవుడయ్యారు. రాళ్లవానతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. పంటనష్టాన్ని చూసి చలించి తక్షణమే ఎకరాకు రూ. 10వేల చొప్పున పంట నష్టపరిహారాన్ని ప్రకటించి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 2.28లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లగా తక్షణమే రూ. 228 కోట్లు విడుదల చేసి రైతుల ముఖాల్లో చిరునవ్వులు నింపారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలవడంపై ఉమ్మడి జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ముఖ్యమంత్రిని తాము ఎన్నడూ చూడలేని కితాబిచ్చారు.
రైతుబిడ్డగా…..రైతన్నలకు అండగా
రైతుబిడ్డ, స్వయాన సాగులో అనుభవం ఉన్న సీఎం కేసీఆర్, పంట నష్టం వాటిల్లిన రైతులకు అండగా నిలిచారు. అధైర్యపడొద్దు అండగా ఉన్నానంటూ రైతులను భుజం తట్టి భరోసా ఇచ్చారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయినా గతంలో ఏ ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపానలేదు. రాళ్లవానతో పంటలకు నష్టం వాటిల్లిన వెంటనే అధికారులతో కలిసి పంట నష్టం సంభవించిన జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తూ రైతులను ఓదార్చారు. దేశంలో ఎక్కడా లేనంతగా ఎకరాకు రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయం రైతాంగానికి వరమని జిల్లా రైతులు సీఎం కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ర్టానికి ఉండడం రైతుల అదృష్టమని పేర్కొంటున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.
గాంధారి, మార్చి 24: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సాయినేని సత్యనారాయణరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని మరోసారి నిరుపించుకున్నారని తెలిపారు. అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతో ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించడం సంతోషకరమైన విషయమన్నారు.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
ధర్పల్లి, మార్చి 24 : ఓ రైతుగా, రాష్ట్ర పెద్దన్నగా అందరి బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ అకాల వర్షం కారణంగా దెబ్బతిన పంటలకు నష్ట పరిహారం ప్రకటించడం హర్షణీయం. గతంలో ఎప్పుడూ రైతులను పట్టించుకున్న ప్రభుత్వాలను చూడలేదు. పంటలు దెబ్బతిన్నాయన్న విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి వారి భుజం తట్టి నేనున్నానని భరోసా ఇచ్చి, నష్ట పరిహారం ప్రకటించడం చాలా సంతోషం. సీఎం కేసీఆర్కు రైతులంతా రుణపడి ఉంటారు.
-అర్గుల్ రాజేశ్వర్రెడ్డి, రైతు, ధర్పల్లి గ్రామం
సీఎం కేసీఆర్ మనసున్న మారాజు….
వర్షంతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని మరోసారి రుజువైంది. స్వయంగా సీఎం కేసీఆర్ పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించడం సంతోషం.
-గడ్డం చిన్న గంగారెడ్డి, రైతు మైలారం గ్రామం
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లిన రైతులకు ఎకరానికి రూ. 10వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు కుటుంబాలకు భరోసా ఇస్తూ రైతన్నలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ను రైతులు గుండెల్లో పెట్టుకుంటారు.
-ముదిరెడ్డి విఠల్రెడ్డి, రైతు బాన్సువాడ.
రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు
అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిని అన్నమో రామచంద్ర అంటూ ఆందోళన చెందుతున్న రైతులకు సీఎం కేసీఆర్ సార్ అండగా నిలిచారు. కౌలు రైతులకూ ఎకరాకు రూ. 10వేల చొప్పున పంట నష్టపరిహారం అందించి రైతు కుటుంబాలలో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ సారు.
– ధారవత్ లక్ష్మణ్, రైతు జక్కల్దాని తండా
రైతు వ్యతిరేకి కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రంలో వడగండ్ల వర్షానికి లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుకు అండగా ఉంటామని ప్రకటన విడుదల చేయకపోవడం సిగ్గు చేటు. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నష్టపోయిన రైతులకు కనీసం సానుభూతి ప్రకటించక పోవడం వారి పరిపాలనకు నిదర్శనం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ నష్టపరిహారం ప్రకటించి అండగా నిలిచారు. ఆయనకు రైతుల పక్షాన కృతజ్ఞతలు.
-జగ్రాం నాయక్, బోర్లం క్యాంపు తండా