తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో నిరుపేదలకు గూడు దొరుకుతున్నది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా కొనసాగుతున్నది. డబుల్ ఇండ్ల పథకానికి కామారెడ్డి జిల్లా అందునా బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. అయితే, పేదల కండ్లలో ఆనందం, సీఎం కేసీఆర్కు వస్తున్న మైలేజీని చూసి కొందరు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. పసలేని ఆరోపణలతో పతాక శీర్షికలతో తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. పూర్తి పాదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంటే.. ఇంకా ‘ఆంధ్ర’ భావాలు వీడని ఓ పత్రిక డబ్బులు తీసుకుంటున్నారంటూ కథనం వండి వార్చడంపై లబ్ధిదారులు మండి పడుతున్నారు.
కామారెడ్డి, మే 15 (నమస్తే తెలంగాణ) : డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు రూ.5,562 లక్షల అంచనా వ్యయంతో 10,585 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, రూ.3,092 లక్షల వ్యయంతో 5,957 ఇండ్లు పూర్తయ్యాయి. 2,195 ఇండ్లు పురోగతిలో ఉండగా, 570 పనులు ప్రారంభదశలో ఉన్నాయి. 1863 పనులు టెండర్ దశలో ఉన్నాయి. వీటిలో కామారెడ్డి డివిజన్లో రూ.1780 లక్షలతో 3,396 ఇండ్లు మంజూరు కాగా, 1,557 ఇండ్లు పూర్తయ్యాయి. 663 ఇండ్లు పురోగతిలో, 827 ఇండ్లు టెండర్ దశలో, 349 ఇండ్లు ప్రారంభ దశలో ఉన్నాయి. బాన్సువాడ డివిజన్లో రూ.3,782 లక్షలతో 7,189 ఇండ్లు మంజూరవగా, 4,400 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,532 ఇండ్లు పురోగతిలో, 221 ప్రారంభ దశలో, 1,036 ఇండ్లు టెండర్ దశలో ఉన్నాయి. బాన్సువాడ (రూరల్), నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో 4,227 ఇండ్లు మంజూరు కాగా, 4,142 ఇండ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. బాన్సువాడ పట్టణంలో 1,611 ఇండ్లకు గాను 1,508 పనులు పురోగతిలో ఉన్నాయి. జుక్కల్ నియోకవర్గంలో 1,466 ఇండ్లు మంజూరైతే, 1,117 ఇండ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి.
ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన చోట పేదలకు వాటిని అందజేశారు. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఒకటికి రెండుసార్లు వడపోసి మరీ అర్హులనే ఎంపిక చేశారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా ఇండ్లను పంపిణీ చేస్తే.. ఇంకా ‘ఆంధ్ర’ వాసన పోని ఓ పత్రిక తప్పుడు రాతలు రాసి విష ప్రచారం చేస్తున్నది. సమాజానికి వెలుగులు ప్రసరించాల్సిన ‘జ్యోతి’.. తనకున్న ‘పచ్చ’కామెర్లతో లోకమంతా పచ్చగే ఉన్నట్లు భ్రమించి పసలేని ఆరోపణలు ప్రచురిస్తున్నది. పేదలు ఆనందంగా ఉండడం చూడలేక డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంపై తప్పుడు వార్త రాసి.. తెలంగాణపై, తెలంగాణ ప్రభుత్వంపై తన వ్యతిరేక వైఖరిని మరోసారి నిరూపించుకున్నది. ఓ పే..ద్ద కథనం వండి వార్చిన సదరు దినపత్రిక.. అందులో ఫలానా చోట, ఫలానా లబ్ధిదారుడి నుంచి ఇంటి కోసం డబ్బులు తీసుకున్నారనే మచ్చుకైనా చెప్పలేదు. వాస్తవానికి ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా అర్హులైన వారికే డబుల్ బెడ్రూం ఇల్లు దక్కుతున్నది. ఈ విషయాన్ని బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇల్లు పొందిన ఏ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లినా తెలుస్తుంది. అంతే కాదు, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి.. ఎక్కడికి వెళ్లి లబ్ధిదారులను అడిగినా నిజమేమిటో తెలుస్తుంది. క్షేత్ర స్థాయికి వెళ్లకుండా, లబ్ధిదారులను కలువకుండా తప్పుడు కథనం వండి వార్చిన సదరు పత్రిక దుర్నీతిని లబ్ధిదారులు ఎండగడుతున్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఇండ్లు నిర్మించారు. సీఎం కేసీఆర్తో ఉన్న చొరవతో పెద్ద సంఖ్యలో పేదలకు ఇండ్లు మంజూరు చేయించారు. కాంట్రాక్టర్లను బతిమిలాడి ఇండ్లు కట్టించారు. సొంత జాగా ఉన్న వారికి డబ్బులు ఇప్పిస్తున్నారు.
పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిర్వహించి ఇండ్లు అప్పగిస్తున్నారు. ఏడు పదుల వయస్సులోనూ నవ యువకుడిలా నియోజకవర్గమంతా తిరుగుతూ పేదల సంక్షేమం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న స్పీకర్పైనా.. తప్పుడు రాతలు రాయడం ప్రస్తుతం కొడిగట్టే దశకు చేరిన ‘జ్యోతి’కే చెల్లింది. వాస్తవానికి ఎక్కడ ఏ సమావేశం జరిగినా పోచారం స్పీకర్.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాలు పూర్తిగా ఉచితమని, ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెబుతున్నారు. లంచం అడిగితే క్రిమినల్ కేసులు పెట్టిస్తానని అధికారులను హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, లంచం తీసుకున్న వారిని, ఇచ్చిన వారిని కూడా జైలుకు పంపిస్తానని ప్రజల సాక్షిగానే చెబుతున్నారు. డబుల్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో, పథకాల అమలులో ఇంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా సదరు పత్రికకు కనిపించక పోవడం గమనార్హం.
మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడని జీవితం. ఏండ్ల కొద్ది అద్దె ఇంట్ల ఉన్నం. నెలనెలా కిరాయి కట్టుడికే మస్తు తిప్పలైతుండె. గ టైంల పోచారం సారు మాకు బీడీ వర్కర్స్ కాలనీలో ప్లాట్ ఇప్పించిన్రు. అట్లనే డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టించిండు. వోళ్లు కూడా మమ్ముల్ని పైసలు ఇయ్యుండ్రి అని అడగలె.ప్లాటు కొనుడు గానీ, ఇల్లు కట్టుడుగానీ మా జీవితంల కాకపోతుండే. పోచారం సారు దయ వల్ల మాకింత నీడ దొరికింది.
ఈమె పేరు మహమూదా బేగం. బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర వాసి. భర్త అనారోగ్యంతో చనిపోతే కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. సొంతిల్లు లేక 15 ఏండ్లుగా కిరాయికి ఉంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం బాన్సువాడ శివారులో 500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నదని తెలుసుకున్న ఆమె.. తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నది. దరఖాస్తును పరిశీలించిన రెవెన్యూ అధికారులు పలుమార్లు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. అర్హురాలు అని తేలడంతో ఆమెకు ఇంటిని మంజూరు చేశారు. దీంతో ఆమెకు గూడుతో పాటు కొండంత అండ దొరికింది. ‘ఇండ్లు కట్టిస్తున్నరని తెలిసింది. మండలాఫీసుల దరఖాస్తు చేసుకున్న. ఆఫీసర్లు అచ్చిన్రు. అన్ని తెలుసుకున్నరు. యాడ ఒక్క రూపాయి ఇయ్యలె. వోళ్లు కూడా పైసలు కావాలని అడగలె. స్పీకర్ సారు దయతోని ఇల్లు అచ్చింది. మా కుటుంబానికి నీడ దొరికింది. కేసీఆర్ సారును, పోచారం సారును బతికినన్ని రోజులు యాదిమరువమని’ మహమూదా బేగం పేర్కొంది.
ఇంట్ల అందరూ పని చేస్తేనే ఇల్లు గడిచేది. అద్దె ఇంట్ల మస్తు దినాలు ఉన్నాం. సొంతిల్లు కట్టుకోవాలని కల ఉంటది. కానీ గీ కాలంల ప్లాటు కొనుడు, ఇల్లు కట్టుడు అంటే లచ్చల ముచ్చట. మాకు ఆ రందీ లేకుండా చేసిండు సీఎం సారు, స్పీకర్ సారు. ప్లాటు ఇచ్చిండ్రు, మంచిగా ఇల్లు కట్టించి ఇచ్చిండ్రు. మేం బతికినన్ని దినాలు సార్లను యాది మరువం. ఇల్లు ఇయ్యనికి మమ్ముల్ని వోళ్లు కూడా పైసలు అడగలేదు. మేం యాడ రూపాయి ఇయ్యలేదు. పేదలు సంతోషంగా బతుకుడు కొందరికి నచ్చది. అందుకే ఏవేవో తప్పుడు కూతలు కూస్తా ఉంటారు.
– ముదుగొండ సునీత, పీఎస్ఆర్ బీడీ వర్కర్స్ కాలనీ
ఏ అధికారికిగానీ, ప్రజాప్రతినిధులకుగానీ ఒక్క రూపాయి కూడా ఇయ్యకుండానే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది. పలు మార్లు మా ఇంటి పరిస్థితిని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది వచ్చి విచారణ జరిపారు. తర్వాత తాడ్కోల్ శివారులో నిర్మించిన నూతన డబుల్ బెడ్రూమ్ ఇంటిని తనకు మంజూరు చేశారు. మా కుటుంబం జీవితాంతం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రుణపడి ఉంటాం
– అంజలి, గృహిణి, డబుల్ బెడ్ రూం లబ్ధిదారురాలు, బాన్సువాడ
మాకు ఇస్లాంపురలో పూరిల్లు ఉండే. వర్షం పడితే నీళ్లు లోపలికి అచ్చేటివి. ఆనకాలంల నిద్ర ఉండక పోతుండే. మస్తు తిప్పలు పడ్డం. ఇండ్లు కట్టుకునేటోళ్లకు సర్కారు పైసలు ఇస్తదని తెలిసింది. దరఖాస్తు చేసుకున్నం. పోచారం సార్ దయతోని మాకు ఎమ్మట్నే మంజూరైంది. పూరిల్లును కూల్చి, కొత్త ఇంటిని కట్టుకున్నం. బేస్మిట్, స్లాబ్, గోడలు, ప్లాస్టింగ్తో పాటు ఇల్లు పూర్తయ్యే దాంక తాపకు కొన్ని పైసలు అచ్చినయి. బిల్లుల కోసం యాడ రూపాయి ఇయ్యలె. దళారులు లేరు.. ఆఫీసర్లు కూడా పైసలు ఇయ్యాలని అడగలేదు. బంగ్లాల బతుకుతా అని అనుకోలే. గీ సర్కారు వల్ల ఇప్పుడు బంగ్లాల దర్జాగా బతుకుతున్న.
– షేక్ షాదుల్ మియా, బాన్సువాడ
నేను పాత బాన్సువాడ 8వ వార్డులో ఉండేవాళ్లం. మాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఏడాది క్రితం కూతురి పెండ్లి చేశాం. ఇంటికి కూతురు, అల్లుడు వస్తే ఉండడానికి ఇబ్బందిగా ఉండేది. మేము స్థానిక కౌన్సిలర్తో తహసీల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించాం. మూడు విడుతల్లో మా ఇంటికి అధికారులు వచ్చి విచారణ జరిపారు. తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కేటాయించారు. కొత్త ఇంటికి మారాక ఆనందంగా ఉంటున్నాం. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు.
– దొన్కంటి సాయవ్వ, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారురాలు, బాన్సువాడ