నిజామాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఖలీల్వాడి: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీరుపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఒంటెద్దు పోకడలు అవలంభిస్తున్నారంటూ ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. ఇప్పటికే తన నోటిదురుసు, తలబిరుసుతో అర్వింద్ తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన నిజామాబాద్ ఎంపీ.. మూడున్నరేండ్లు కాలయాపన చేశారు.
చెప్పుకోవడానికి చేసిందేమీ లేకపోవడంతో అధికార టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నేతలపై అవాకులుచెవాకులు పేలుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు. మరోవైపు, తన ప్రవర్తనతో పార్టీ పరువు తీస్తున్నారని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎంపీ తీరుపై మండిపడుతున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించిన ఇన్చార్జీల నియామకంలోనూ ఇష్టానుసారంగా వ్యవహరించడంపైనా నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో రెండు గంటలకు పైగా బైఠాయించి నిరసన తెలిపారు.
సీనియర్లకు ప్రాధాన్యమేది?
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పదాధికారుల సమావేశంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఏండ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అర్వింద్ తన అనుచరులకే పదవులు ఇప్పించుకుంటున్నారని వివిధ మండలాలకు చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. కొందరు పార్టీ కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ఇష్టారీతన ఇన్చార్జీలను నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్ తన అనుచరులకే పదవులు ఇప్పించుకుంటున్నారని నిరసిస్తూ రెండు గంటలకు పైగా బైఠాయించారు.
ఎంపీ తీరుపై ఆగ్రహం..
ఎంపీతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అర్వింద్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎటు పోతుందో తెలియడం లేదన్నారు. ఎంత మంది కార్పొరేటర్లు పోయినా పట్టించుకునే వారే కరువయ్యారని అర్వింద్పై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాలకు చెందిన నేతలు.. ఎంపీపై నిప్పులు చేరిగారు. పాత వారిని తొక్కిపెట్టి, కొత్త వారికే పట్టం కట్టడం ఏమిటని ప్రశ్నించారు.
‘మొదట్నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను నమ్ముకుని బీజేపీలో పని చేస్తున్న తామంతా పిచ్చోళ్లమా..? మా పరిస్థితి ఏమిటి? జైళ్లు, కేసులు మాకు.. పదవులు, ఆర్భాటాలు మీకా?’ అంటూ బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు నిలదీశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల్లో బీజేపీని చులకన చేస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు. నచ్చని వారిని బెదిరించడం, కొత్తగా చేరిన వారిని మచ్చిక చేసుకుని పార్టీని అభాసుపాలు చేస్తున్నారని ఆందోళనకు దిగారు. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లను పూర్తిగా పక్కన పెడుతున్నారంటూ ఒకరి తర్వాత మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ముఖ్య నాయకులు మిన్నకుండి పోయారు. పదాధికారుల సమావేశం కాస్తా పక్కదారి హడావుడిగా కార్యక్రమాన్ని ముగించేశారు.