మాక్లూర్, సెప్టెంబర్ 30: కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అభివృద్ధికి చేటని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. వాళ్లు ఐదేండ్లకోసారి వచ్చే సంక్రాంతి గంగిరెద్దులని, మోసపూరిత మాటలు నమ్మి ఓటేస్తే కాటేస్తారని అన్నారు. ఐదేండ్లలో కాంగ్రెస్, బీజేపీ నాయకులెవరైనా మీ గ్రామాలకొచ్చారా? అని ప్రశ్నించారు. నమస్తే నవనాథపురంలో భాగంగా మండలంలోని రాంచంద్రాపల్లిలో శనివారం ప్రజాశీర్వాద యాత్ర నిర్వహించి ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో జీవన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు తప్ప జనం పాట్లు పట్టవని ధ్వజమెత్తారు.
ఒక్క బీఆర్ఎస్సే ఇంటిపార్టీ అన్ని, కేసీఆర్ సబ్బండ వర్గాల దేవుడని అన్నారు. తెలంగాణ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. పదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి సాధించామన్నారు. రాంచంద్రాపల్లి గ్రామపంచాయతీకి ఏటా రూ. 24.6 లక్షల చొప్పున మొత్తం రూ. 92.2 లక్షల అభివృద్ధి నిధులొచ్చాయని తెలిపారు. 471 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయని, వీటిలో వృద్ధులకు 67, వితంతువులకు 134, దివ్యాంగులకు 20, ఒంటరి మహిళలకు 13, బీడీ కార్మికులకు 239, ఒక గీత కార్మికుడిని కలుపుకొని యేడాదికి రూ.1.18 కోట్ల పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. వీటితోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబార్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని తెలిపారు. అభివృద్ధిలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్న తనను మూడోసారి దీవిస్తే జీతగాడిలా సేవచేస్తానన్నారు. అంతకుముందు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామానికి వెళ్లిన జీవన్రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు.
జీవన్రెడ్డి సమక్షంలో చేరికలు..
రామచంద్రాపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో శనివారం పర్యటించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్సలో చేరినవారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. గుత్ప ఉప సర్పంచ్ రాఘవేందర్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పారు. డీకంపల్లి గ్రామానికి చెందిన 30 యాదవ కుటుంబాల బీఆర్ఎస్ పార్టీలో చేరగా జీవన్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేస్తున్న జీవన్రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, దొడ్లె రాజు నాయకులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలకేంద్రానికి చెందిన పెద్దబార్ల సంఘం, తుమ్మల సంఘం, గూండ్ల సంఘం, గౌడ చిన్నసంఘం, మాదిగ, మాల మహిళా సంఘాలకు చెందిన సభ్యులు జీవన్రెడ్డి నివాసంలో బీఆర్ఎస్లో చేరారు.