మాక్లూర్, నవంబర్ 24: ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టం పెరిగింది. దీంతో యాసంగిలో రైతులు వరి సాగుకు మొగ్గుచూపుతున్నారు. కానీ వరి తర్వాత వరిని సాగు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. యాసంగిలో ముఖ్యంగా బావులు,బోర్ల కింద ఆరుతడి పంటలను సాగు చేయాలని, కాలువలు, పెద్ద చెరువుల కింద వీలైన చోట్ల వరిని తగ్గించి మెట్ట పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు యాసంగి సాగు నేపథ్యంలో వరి నారుమడిలో యాజమాన్య పద్ధతులు పాటించాలని చెబుతున్నారు. చలి ప్రభావం నారుమడిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నారు పోసుకునే సమయం:
యాసంగి వరి సాగులో భాగంగా నారు పోసుకునేందుకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు శాస్త్రవేత్తలు సిఫారసు చేశారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నవంబర్ చివరి వరకు మాత్రమే నార్లు పోసుకోవాలి. కొద్దిమంది రైతులు ముందుగా (నవంబర్ మొదటివారం) నార్లు పోసుకుంటే, త్వరగా కోతలు పూర్తి చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. కానీ తెలంగాణలో ఉండే చలి వాతావరణం దృష్ట్యా గింజ తాలుపోయే ప్రమాదముంటుంది. వరిపూత దశలో 22 డిగ్రీల సెం.గ్రే కన్నా ఉష్ణోగ్రతలు (డిసెంబర్ 20 తర్వాత) వరి గింజ కట్టే దశలో ఉండే అధిక ఉష్ణోగ్రతలతో గింజలపై పగుళ్లు ఏర్పడి నూక అధికంగా వస్తుంది. ఏప్రిల్ మొదటి వారం వరకు వరి కోతలు పూర్తయ్యేలా జాగ్రత్త వహించాలి.
నారుమడి యాజమాన్యం