మెండోరా, నవంబర్ 14: ప్రజల కోసం పనిచేసిన వారినే గెలిపించాలని, మరింత అభివృద్ధి జరుగుతుందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు ఓటు.. 24 గంటల కరెంట్కు చేటు అని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెండోరా మండలంలోని వెల్కటూర్, సావెల్, చాకిర్యాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఊరూరా వేములకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యం చేయగా.. వారితోపాటు మంత్రి వేముల నృత్యం చేసి ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల్లో హామీనిచ్చి వ్యవసాయానికి కూడా సరిగ్గా కరెంట్ ఇవ్వలేకపోతుందన్నారు. రైతులతో నిరసనలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణలో కూడా చాలీచాలనీ కరెంట్ కష్టాలు తప్పవన్నారు.
కాంగ్రెస్ నాయకులు చెప్పే హామీలను నమ్మి మోసపోవద్దని, కోరికోరి కర్ణాటక లాంటి కష్టాలను తెచ్చుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ హయాంలో కాకతీయ కాలువ నీటి కోసం రైతులు పడ్డ కష్టాలు, ఇబ్బందులను మరిచిపోలేమన్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాకతీయ కాలువ నీటి కోసం రైతులు పడ్డ కష్టాలు, వారి ఆందోళనను తెలుసుకొని సీఎం కేసీఆర్ సహకారంతో కాకతీయ కాలువను 365 రోజు లు నిండుగా ఉండేలా చేశామని తెలిపారు. దీంతో కాకతీయ కాలు వ నీటి సమస్య శాశ్వతంగా దూరమైందన్నారు. వెంచిర్యాల్, వెల్కటూర్ గ్రామాల మధ్య వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతుండడంతో, వంతెన నిర్మించి 60 ఏండ్ల సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. సావెల్, చాకిర్యాల్ విద్యుత్ సబ్స్టేషన్ల కోసం రైతులు 50ఏండ్లు చెప్పులరిగేలా తిరిగినా తన కన్నా ముందు పని చేసిన వారు ఏమీ చేయలేకపోయారన్నారు. ఎమ్మెల్యేగా తాను ఎన్నికైన అనతికాలంలోనే సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా విన్నవించి నూతన సబ్స్టేషన్లు నిర్మించి రెండు గ్రామాల కల నెరవేర్చినట్లు చెప్పారు.
సావెల్లో ప్రత్యేక కృషితో పుష్కరఘాట్ను నిర్మించామన్నారు. దీంతో పుష్కరాల సమయంలో సావెల్ గ్రామం రాష్ట్రమంతటా తెలిసిపోయిందన్నారు. ఈ గ్రామాలు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయని గుర్తు చేశారు. ఈ గ్రామాల పక్కనే ఉన్న గోదావరి నీటిని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా అందజేసి మహిళల నీటి కష్టాలు దూరం చేశామన్నారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఈ పని చేయలేకపోయాయని తెలిపారు. సావెల్లో రూ.12 లక్షలతో వైకుంఠ ధామం, రూ.20 లక్షలతో ఆరోగ్య ఉప కేంద్రం, రూ. కోటీ 40లక్షలతో సీసీ రోడ్లు, అన్ని కులసంఘాలకు భవనాలు నిర్మించినట్లు వివరించారు. రుణమాఫీ అందరికీ అందుతుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్రెడ్డి, ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ తలారి గంగాధర్, వేల్పూర్ ఏఎంసీ చైర్పర్సన్ అరుణ, సర్పంచులు సామ గంగారెడ్డి, దేవన్న, ఎంపీటీసీ రాజు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.