ఆయకట్టు మురిసి పోతున్నది.. సాగునీటి రాకతో సస్యశ్యామలంగా మారుతున్నది.. ఉమ్మడి జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకున్నది. లక్షలాది ఎకరాల ఆయకట్టు పచ్చదనం సంతరించుకుంటున్నది. ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా జీవనాడి నిజాంసాగర్తో పాటు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని వదులుతున్నారు. దీంతో రైతులు ఉత్సాహంగా పంటల సాగులో నిమగ్నమయ్యారు. నార్లు పోయడం, నాట్లు వేయడంలో బిజీగా మారారు. సాగుకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. వ్యవసాయానికి ఉచిత కరెంట్ సరఫరాతోపాటు సాగుకు పెట్టుబడి సాయం ఇవ్వడం మొదలుకుని అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నది. చివరికి పండించిన పంటలకు సైతం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టినా, సీఎం కేసీఆర్ అందిస్తున్న సహకారంతో కర్షకులు హుషారుగా ముందుకు ‘సాగు’తున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న లక్షలాది ఎకరాల్లో పంటల సాగులో నిమగ్నమయ్యారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఇప్పటికే నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాల నుంచి యాసంగి పంటల సాగుకు నీటి విడుదలను ప్రారంభించారు. ఎప్పటిమాదిరిగానే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో కాలువలు, డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. ఈ నెల 15న నీటి విడుదల ప్రారంభించగా ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశమున్నది. ప్రస్తుతం ఆయకట్టు కింద వరినాట్లు ప్రారంభమవ్వగా జలాశయాల నుంచి నీటి విడుదల చేపట్టడంతో రైతాంగం హర్షం వ్యక్తంచేస్తున్నది.
నిజాంసాగర్, డిసెంబర్ 19: నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు కోసం ఈనెల 15న జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద లక్షా15వేల ఎకరాల్లో సాగవుతున్న పంటల కోసం నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా 1200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జీరో డిస్ట్రిబ్యూటరీ నుంచి 49 డిస్ట్రిబ్యూటరీ వరకు రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. నిజాంసాగర్ జలాశయంలో 1405.00 అడుగులు 17.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1404.50 అడుగులు 17.07 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదు. యాసంగి పంటల సాగుకు ఏప్రిల్ వరకు మొత్తం ఆరు విడుతల్లో నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా రైతులు ఆ దిశగా పంటల సాగులో ముందుకు సాగుతున్నారు.
నిజాంసాగర్ నీటిని మొదటి ఆయకట్టు నుంచి అలీసాగర్ వరకు లక్షా15వేల ఎకరాలకు అందించనున్నారు. ఇందులో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంటలను సాగు చేయనుండగా మరో 15వేల ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేయనున్నారు. జీరో డిస్ట్రిబ్యూటరీ నుంచి అలీసాగర్ వరకు ప్రధాన కాలువ ద్వారా నీటిని అందించడంలో భాగంగా మొదటి విడుత ఈనెల 15న ప్రారంభించారు. పది రోజులు ఆన్, పది రోజులు ఆఫ్ పద్ధతిలో ఏప్రిల్ వరకు నీటి విడుదల కొనసాగించనున్నారు. నిజాంసాగర్, బాన్సువాడ మండలాల్లో తుకాలు సిద్ధం చేసుకోగా నస్రుల్లాబాద్, బీర్కూర్, వర్ని, కోటగిరి, రుద్రూర్, బోధన్ మండలాల్లో నాట్లు జోరందుకున్నాయి.
నిజాంసాగర్ నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు ఆనందంగా ఉన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిలువ ఉండడంతో ఎప్పుడూ లేని విధంగా ముందుగానే పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. మొత్తం ఆరు విడుతల్లో నీటిని విడుదల చేస్తుండడంతో ఆయకట్టు రైతులు ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు
నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండి ఉన్నది. అందుకే తుకాలు సిద్ధం చేసుకుంటున్నాం. యాసంగి సాగుకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండడంతో సంతోషంగా ఉన్నాం. ప్రాజెక్టు కింద తమ పంట పొలాలు ఉండడంతో నాట్లు వేసేందుకు రెడీ చేసుకున్నాం. మరో నాలుగు రోజుల్లో నాట్లు వేయనున్నాం.
-మనీష్రెడ్డి, బుర్గుల్, రైతు, నిజాంసాగర్
నిజాంసాగర్ ఆయకట్టు కింద వానకాలం మాదిరిగానే యాసంగిలో సైతం పూర్తిస్థాయిలో పంటలు వేస్తున్నం. ఇప్పటికే దుక్కులు దున్నుకొని తుకాలు సిద్ధం చేసుకున్నాం. మరో వారం, పది రోజుల్లో నాట్లు కూడా వేస్తాం. నాకు ఆయకట్టు కింద ఆరు ఎకరాల భూమి ఉండగా మొత్తం వరి పంట వేస్తున్న. సీఎం కేసీఆర్ చొరవతోనే నిజాంసాగర్ ప్రాజెక్టు నిండా నీరు ఉన్నది.
– సాయిలు, బుర్గుల్, రైతు, నిజాంసాగర్
నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షా15వేల ఎకరాలకు 8.69టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రతిపాదించారు. ఈనెల 15వ తేదీన మొదటి విడుత నీటిని విడుదల చేశాం. ఏప్రిల్ రెండో వారం వరకు మొత్తం ఆరు విడుతల్లో నీటిని విడుదల చేయనున్నాం. ఆయకట్టు రైతుల అవసరాలకు అనుగుణంగా నీటిని హెచ్చుతగ్గులుగా విడుదల చేస్తాం. రైతులు యాసంగి పంటలను పూర్తిస్థాయిలో సాగు చేసుకోవాలి. నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాలి.
– శ్రావణ్ కుమార్, డీఈఈ నీటి పారుదల శాఖ