కామారెడ్డి, మే 12(నమస్తే తెలంగాణ) ;ఉమ్మడి జిల్లాలో సాగునీటి ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చెక్డ్యాముల నిర్మాణంతో భూగర్భ జలమట్టం పెరుగుతున్నది. మండు వేసవిలోనూ చెక్డ్యాములు జలకళను సంతరించుకోవడం విశేషం. పలు ప్రాంతాల్లో మత్తడి దుంకుతూ నీరు ప్రవహిస్తున్నది. వృథాగా పోతున్న వర్షపు నీటికి అడ్డుకట్ట వేస్తూ చెక్డ్యాములు నిర్మించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలో వాగులు, కాలువల ద్వారా వర్షపు నీరు వృథాగా పోకుండా కేసీఆర్ సర్కారు చర్యలు చేపట్టింది. చెక్డ్యాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆ చెక్డ్యాముల వద్ద జలకళ ఉట్టిపడుతుండగా, రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సాగునీటి రంది తీర్చిన సీఎం కేసీఆర్, జిల్లా ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు చెబుతున్నారు.
15.98కోట్లతో చెక్డ్యామ్..
బాన్సువాడ టౌన్, మే 12: బాన్సువాడ పరిధిలోని మంజీరా నదిపై చింతల్ నాగారం శివారులో నిర్మించిన చెక్డ్యాంతో సుమారు 4వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో కామారెడ్డి జిల్లాలోనే అత్యంత వేగవంతంగా నిర్మాణం పూర్తయిన చెక్డ్యాం ఇది. రూ.15.98కోట్లతో, 450 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తుతో చెక్డ్యాంను నిర్మించారు. చెక్డ్యాం నిర్మాణం పూర్తికావడంతో సుమారు 3.5 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటున్నది. బాన్సువాడ నుంచి బొల్లక్పల్లి వంతెన వరకు జలకళను సంతరించుకున్నది.
రెండు పంటలకూ నీరు..
ఇకపై నీటి కోసం మొగులును చూసే పనిలేదు. చెక్డ్యాం నిర్మాణంతో 4కిలోమీటర్ల వరకు నీరు నిల్వ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది. రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి పనులు చేయించడంలో స్పీకర్ పోచారాన్ని మించిన నాయకులు లేరు. ఆయనకు రుణపడి ఉంటాం. ఇకపై వర్షాల కోసం ఎదురుచూసే పనిలేదు.
– నర్సగొండ, రైతు, బాన్సువాడ
తాగునీటి సమస్య తీరింది..
ఒకప్పుడు వేసవికాలం వస్తే తాగునీటి సమస్య ఉండేది. కానీ, ఇప్పుడు మంజీరానది నిండుకుండలా ఉండడంతో కష్టాలు తప్పాయి. చెక్డ్యాం నిర్మాణంతో ప్రజలతోపాటు మూగజీవాలకూ తాగునీటికి ఇబ్బందులు లేవు.
సాగుకు ఇబ్బంది లేదు
సిరికొండ, మే 12: సిరికొండ మండలంలోని తూంపల్లి, కొండాపూర్, గడ్కోల్, రామడుగు, హుస్సేన్నగర్, కొండూర్, చిన్నవాల్గోట్, పెద్దవాల్గోట్, పోత్నూర్ గ్రామాల మీదుగా వెళ్తున్న కప్పలవాగుపై రాష్ట్ర ప్రభుత్వం చెక్ డ్యాములను నిర్మించింది. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో రూ.4కోట్లతో గడ్కోల్, రూ.5కోట్లతో కొండూర్, రూ.6కోట్లతో చిన్నవాల్గోట్, రూ.3కోట్లతో చీమన్పల్లి గ్రామాల పరిధిలో చెక్ డ్యాములను నిర్మించారు. దీంతో బోరుబావుల్లో నీటి శాతం పెరిగింది. పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతున్నది.
నీటి వృథా తగ్గింది..
మా గ్రామంలోని రైతు లు బోరుబావులపై ఆధారపడి వ్యవసా యం చేస్తారు. వానకాలంలో వాగులోని నీరు వృథాగా పోతుంది. చెక్డ్యాములను నిర్మించడంతో సాగునీటి ఇబ్బందులుతీరాయి. ఇప్పుడు నీటి వృథా తగ్గింది.
–భుక రాజేందర్, చీమన్పల్లి, రైతు
వృధా నీటికి ‘చెక్’..
మోర్తాడ్, మే 12: మోర్తాడ్ మండలంలోని పెద్దవాగులో చెక్డ్యాములు నిర్మించడంతో సాగునీటి వనరులు పెరిగాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పెద్దవాగులో చెక్డ్యాంలు నిర్మించి వృథాగా పోయే నీటికి అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనకు ఊపిరిపోశారు. మండలంలోని సుంకెట్లో రూ.9.18కోట్లు, గాండ్లపేట్లో రూ.5.50 కో ట్లు, పాలెంలో రూ.8.80కోట్లతో చెక్డ్యాములను నిర్మించారు. ఈ మూడు చెక్డ్యాముల నిర్మాణంతో సుంకెట్, మోర్తాడ్, గాండ్లపేట్, దొన్కల్, ధర్మోరా, పాలెం గ్రామాల రైతుల సాగునీటి ఇబ్బందులు దూరమయ్యాయి.
మోటర్లతో సాగునీరు అందిస్తున్నం..
చెక్డ్యాం కట్టినంక వాగులో ఎప్పుడూ నీళ్లు కనిపిస్తున్నయి. మోటర్లు పెట్టుకొని పంటలకు నీళ్లందించుకుంటున్నం. ఇంతకుముందు వాగుల నీళ్లు లేక వానకాలమే పంటలు పండించేటోళ్లం. ఇప్పుడు పంటలు పండిస్తున్నాం.
– సాయన్న, రైతు, పాలెం
మంత్రికి రుణపడి ఉంటాం..
ఏండ్ల నుంచి చెక్డ్యాం కావాలని ఎవరిని అడిగినా పట్టించుకోలేదు. మంత్రి ప్రశాంత్రెడ్డిని అడగకుండానే పెద్దవాగుపై చెక్డ్యాములను కట్టించి మాకష్టాలు తీర్చారు. ఇంతకుముందు నీళ్లకోసం గోసపడేటోళ్లం. ఇప్పుడు మోటర్లు పెట్టుకొని పైప్లైన్ ఏసి నీళ్లు పారిచ్చుకుంటున్నం. చెక్డ్యాములు నిర్మించిన మంత్రికి రుణపడి ఉంటం.
– శంకర్, రైతు, పాలెం
2వేల ఎకరాలకు ప్రయోజనం
బోధన్ మండలంలోని చిన్నమావంది, పెగడాపల్లి వద్ద పసుపు వాగుపై నిర్మించిన రెండు చెక్డ్యాములతో జలకళ సంతరించుకున్నది. కిలోమీటర్ల మేర నీటి నిల్వలతో చెరువును తలపిస్తున్నది. రైతుల విజ్ఞప్తితో ఎమ్మెల్యే షకీల్ రెండేండ్ల క్రితం రెండు చెక్డ్యాముల నిర్మాణం కోసం నిధులను మంజూరు చేయించారు. చిన్నమావంది వద్ద రూ.5.91కోట్లు, పెగడాపల్లి-చిన్నమావంది చెక్డ్యామ్ నిర్మాణానికి రూ.5.51కోట్లను కేటాయించి పనులు పూర్తి చేశారు. రెండు చెక్డ్యాములు ప్రస్తుతం జలాశయాలను తలపిస్తున్నాయి. నిల్వ నీటితో వాగుకు ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. బోధన్ మండలంలోని లంగ్డాపూర్, చిన్నమావంది, పెద్దమావంది, పెగడాపల్లి గ్రామాల్లో దాదాపు 2వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరనున్నది.
భూగర్భ జలమట్టం పెరిగింది..
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గతంలో మూడు బోర్ల్ల ద్వారా పంటలను సాగు చేసేవాడిని. భూగర్భ జలమట్టం తగ్గి బోర్లలో నీరు తగ్గిపోయేది. ఇప్పుడు పసుపు వాగుపై చెక్డ్యామ్ నిర్మించడంతో ఎత్తిపోయిన బోర్లు కూడా నీరు పోస్తున్నాయి. యాసంగిలో కూడా వరి పంటను సాగు చేస్తున్నాం. చెక్డ్యామ్ నిర్మించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మద్దె సుదర్శన్, రైతు, పెగడాపల్లి
రూరల్లో పది చెక్డ్యాములు..
ధర్పల్లి, మే 12: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పది చోట్ల చెక్ డ్యాములను నిర్మించడంతో భూగర్భ జల వనరులు పెంపొందాయి. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో అత్యధికంగా రూరల్లో పది చెక్ డ్యాములు నిర్మించడంపై నియోజకవర్గ రైతాంగం హర్షం వ్యక్తంచేస్తున్నది. జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్ పెద్ద వాగుపై 5.36కోట్లతో చెక్డ్యాం నిర్మాణం, డిచ్పల్లి మండలంలోని రాంపూర్ బుగ్గవాగుపై రూ.2.70కోట్లు, కొరట్పల్లి(సుద్దులం) పెద్దవాగుపై రూ.5.66కోట్లు, సుద్దులం పెద్దవాగుపై రూ.4.03కోట్లు, సిరికొండ మండలం కొండూర్ కప్పలవాగుపై రూ.4.01 కోట్లు, చిన్న వాల్గోట్ కల్లుమండ పెద్దవాగుపై రూ.8.97కోట్లు, ధర్పల్లి మండలంలోని మైలారం పెద్దవాగుపై రూ.6.71కోట్లు, రామడుగు పెద్దవాగుపై రూ.4.39 కోట్లు, రూరల్ మండలంలోని పాల్దా ఫూలాంగ్ వాగుపై రూ.4.51కోట్లు, కొండూర్ పూలాంగ్ వాగుపై రూ.4.51కోట్లు వెచ్చించి చెక్డ్యాములను నిర్మించారు. దీంతో భూగర్భ జలమట్టం పెరగడంతోపాటు సాగునీటికి ఢోకా లేకుండా పోయింది.
ఎమ్మెల్యే కృషితోనే…
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే కృషితోనే మా గ్రామంలోని వాగుపై చెక్డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. రూ.6.71కోట్లు మంజూరు చేయించి వాగుపై చెక్డ్యాం నిర్మించడంతో భూగర్భ జలమట్టం పెరిగి సాగునీటికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. చెక్డ్యాములు నిర్మించిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
–రాజేందర్రెడ్డి, రామడుగు సొసైటీ చైర్మన్, మైలారం
భూగర్భ జలవనరులు పెరిగాయి
చెక్డ్యాముల నిర్మాణంతో భూగర్భ జలవనరులు పెరిగి బోర్లలో నీళ్లు ఫుల్లుగా వస్తున్నాయి. చెక్డ్యాం పూర్తిగా నిండితే చిన్నపాటి చెరువులా కనిపిస్తున్నది. యాసంగి పంటలకు సైతం నీటికి ఎలాంటి రంది లేకుండా పోయింది. ఇంతకు ముందు వాగు పారితే జలకళ ఉంటుండే, కానీ ఇప్పుడు చెక్డ్యాం పైభాగమంతా నీటి జలకళతో ఉట్టిపడుతున్నది.
–సోమ శేఖర్, రైతు నాయకుడు, మైలారం