నిజాంసాగర్, డిసెంబర్ 14: నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు కోసం నిజాంసాగర్ నీటిని బుధవారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద డీ-49 అలీసాగర్ వరకు లక్షా15వేల ఎకరాల్లో యాసంగి పంటలు సాగు కానున్నాయని ఇందుకోసం ఆరు విడుతల్లో 9 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నామని చెప్పారు.
ఉన్నతాధికారుల సూచనల మేరకు బుధవారం ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశామని, ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలను హెచ్చుతగ్గులుగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. బుధవారం నుంచి ఏప్రిల్ వరకు మొత్తం ఆరు విడుతల్లో ఆన్ ఆఫ్ పద్ధతిలో పదిరోజుల చొప్పున నీటిని విడుదల చేయనున్నామన్నారు ప్రస్తుతం మొదటి విడుత నీటి విడుదలను 15రోజులపాటు కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీలకు 1404.86 అడుగులు 17.60 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు. ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వృథా చేయవద్దని కోరారు.