మెండోరా, ఆగస్టు 2 : ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 24,514 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 3 వేలు, కాకతీయ కాలువకు 5 వేలు, వరద కాలువకు 5 వేలు, లక్ష్మీ కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం సరస్వతీ కాలువకు 100 క్యూసెక్కుల నీటి విడుదలను 11 గంటలకు ప్రారంభించామన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఈ సీజన్లో 216.738 క్యూసెక్కుల వరద వచ్చి చేరిందన్నారు. దీంతో దిగువ గోదావరిలోకి కాకతీయ, వరద కాలువలకు 161.021 టీఎంసీల మిగులు జలాలను విడుదల చేశామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 1087.90 అడుగుల (76.104 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు.
నిజాంసాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్, ఆగస్టు 2 : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి ఇన్ఫ్లో వస్తుండడంతో ఒక వరద గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ శివకుమా ర్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1403.81 అడుగుల (16.09 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు. ఎగువ భాగం నుంచి 7,100 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో 5,500 క్యూసెక్కుల నీటిని వరద గేటు ద్వారా మంజీరలోకి విడుదల చేస్తుండగా మరో 1600 క్యూసెక్కుల నీటిని ఆయకట్టు కోసం ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.